హైదరాబాద్లో స్టూడెంట్స్ వార్ ! అమ్మాయి కోసం నడి రోడ్డుపై కొట్టుకున్న విద్యార్థులు !
హైదరాబాద్ : వాళ్లంతా స్టూడెంట్స్.. ఫేర్వెల్ పార్టీలో ఎంజాయ్ చేశారు. ఇంతలో చిన్న గొడవ జరిగింది. అది కాస్తా చినికి చినికి గాలి వానగా మారింది. ఓ యువకుడు మరొక యువకుడి గల్లా పట్టుకుని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చాడు. ఇంతలో ఆ ఇద్దరి తరఫున రెండు గ్యాంగులు కర్రలు, రాళ్లు పట్టుకుని రోడ్డుపైకి వచ్చి రణరంగం సృష్టించాయి. దూషణలతోమొదలైన గొడవ పరస్పరం రాళ్లు, కర్రల దాడికి దారితీసింది. సినిమా సీన్ను తలపించిన ఘటన హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగింది.
కట్నం కోసం చిత్రహింసలు పెట్టారు! రిటైర్డ్ జడ్జిపై కోడలు ఫిర్యాదు, కేసు నమోదు!
నడిరోడ్డుపై రియల్ ఫైట్
హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఫార్చూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కాలేజీ స్టూడెంట్స్ సృష్టించిన బీభత్సం స్థానికులను భయాందోళలకు గురిచేసింది. వారి గొడవలో తమకు గాయాలవుతాయన్న భయంతో పలువురు తమ వాహనాలు విడిచిపెట్టి తలో దిక్కుకు పరుగులు తీశారు. విద్యార్థుల మధ్య రాళ్లదాడిలో కూరగాయలు కొనేందుకు వచ్చిన ఓ మహిళ తలకు తీవ్ర గాయమైంది.
అమ్మాయి కోసం...
కాలేజీలో చదువుతున్న ఓ అమ్మాయి విషయంలో నెలకొన్న స్పర్థలే గొడవకు దారితీశాయి. లవణ్ కుమార్ అనే విద్యార్థి అదే కాలేజీకి చెందిన ఓ అమ్మాయికి తరుచూ ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నాడు. ఆమె ఈ విషయాన్ని అదే కాలేజీలో చదువుతున్న హేమంత్కు చెప్పింది. దీంతో హేమంత్, లవణ్ కుమార్ను కొట్టేందుకు పక్కా స్కెచ్ గీశాడు. నైన్త్ ఫేజ్లోని గ్రావిటీ హోటల్లో ఫేర్వెల్ పార్టీని ఇందుకు స్పాట్గా ఎంచుకున్నాడు.
నిందితుల అరెస్ట్
ఫేర్వెల్ పార్టీలో ఎంజాయ్ చేస్తున్న లవణ్ కుమార్ను హేమంత్ కాలర్ పట్టుకుని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చాడు. అప్పటికే బయట వేచిచూస్తున్న మరికొందరు లవణ్ కుమార్పై దాడి చేశారు. దీంతో అతనికి సపోర్ట్గా కొందరు విద్యార్థులు కర్రలు, రాళ్లు పట్టుకొని రోడ్లపైకి వచ్చి పరస్పరం దాడి చేసుకున్నారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హేమంత్తో పాటు పవన్, అభిషేక్, బాలు అనే వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి లవణ్ కుమార్, గానీ గాయపడ్డ మహిళ గానీ కంప్లైంట్ చేయకపోవడం కొసమెరుపు.