కరుడుగట్టిన రౌడీషీటర్ అయూబ్ ఖాన్ చిక్కాడు: ముంబైలో అరెస్ట్?
దుబాయ్లో ఉంటూ నగరంలో నేరాలు, బంగారం స్మగ్లింగ్కు పాల్పడుతున్న రౌడీషీటర్ అయూబ్ఖాన్ ఎట్టకేలకు చిక్కినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్: దుబాయ్లో ఉంటూ నగరంలో నేరాలు, బంగారం స్మగ్లింగ్కు పాల్పడుతున్న రౌడీషీటర్ అయూబ్ఖాన్ ఎట్టకేలకు చిక్కినట్టు తెలుస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఎనిమిది హత్య కేసులతోపాటు 27 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఈ కరడు గట్టిన నేరగాణ్ని ఆదివారం ముంబై విమానాశ్రయంలో పట్టుకున్నట్లు సమాచారం.
అయూబ్ ఖాన్పై పలు నాన్బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉండటంతో నగర పోలీసులు గత సంవత్సరం లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు. 2002లో న్యాయవాది మన్నన్ ఘోరీని పట్టపగలే హత్య చేసిన కేసులో ఇతడు విచారణ ఎదుర్కొంటున్నాడు. అప్పట్లో అరెస్టయిన అతడు 2005లో బెయిల్పై బయటికి వచ్చి తన ఆగడాల్ని కొనసాగించాడు.
పలు కేసుల్లో మోస్ట్వాంటెడ్గా ఉన్న ఇతడు గతంలో మూడుసార్లు పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఓసారి పోలీసులు కాల్పులు జరపడంతో అతడి కాలికి గాయమైంది. చివరిసారిగా 2008లో కర్ణాటక గుల్బర్గాలోని రహస్య స్థావరంపై నగర పోలీసులు దాడి చేసి పట్టుకొచ్చారు. అనంతరం ఘోరీ హత్య కేసులో సాక్షుల్ని అంతమొందించేందుకు ప్రయత్నించి విఫలమైన అయూబ్ఖాన్ శిక్ష తప్పదనే అనుమానంతో 2014లో దుబాయ్ పారిపోయాడు.
అక్కడి నుంచి తన అనుచరుల సహకారంతో శంషాబాద్ విమానాశ్రయం ద్వారా నగరంలోకి బంగారాన్ని పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. రెండు పాస్పోర్టులు కలిగి ఉన్న ఇతడు ముంబై మీదుగా నగరానికి వస్తున్న క్రమంలో చిక్కినట్లు తెలుస్తోంది. అతణ్ని తీసుకువచ్చేందుకు పోలీసులు వెళ్లినట్లు సమాచారం. ముంబైలో ఆయూబ్ఖాన్ చిక్కాడనే ప్రచారం జరుగుతోందని, వాస్తవాలపై ఆరా తీస్తున్నట్లు దక్షిణ మండలానికి చెందిన ఓ కీలకాధికారి తెలిపారు.