కేసీఆర్కు ఫిర్యాదులు: తెలుగు టీవీ ఛానెళ్లలో వైరల్గా నయీం ఎన్కౌంటర్ దృశ్యాలు
హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లా షాద్ నగర్లో సోమవారం ఉదయం చోటు చేసుకున్న గ్యాంగ్స్టర్ నయీం ఎన్ కౌంటర్కు సంబంధించిన దృశ్యాలు తెలుగు న్యూస్ ఛానెళ్లలో వైరల్గా మారాయి. షాద్నగర్ సమీపంలోని మిలీనియం టౌన్షిప్లో జరిగిన గ్రేహౌండ్స్ పోలీసుల కాల్పుల్లో గ్యాంగ్ స్టర్ నయీం హతమైన సంగతి తెలిసిందే.
షాద్నగర్ సమీపంలోని ఓ పెట్రోల్ బంకు నుంచి మొదలైన పోలీసులు కదలికలన్నీ మీడియా కెమెరాలకు చిక్కాయి. పెట్రలో బంకు నుంచే తెల్లవారుజామున పొజిషన్ తీసుకున్న పోలీసులు చాలా ముందు జాగ్రత్తగా వ్యవహరించారు. నయీం ఎన్కౌంటర్ విషయంలో అత్యాధునిక మెషిన్ గన్లతో పోలీసులు రంగంలోకి దిగారు.
పథకం ప్రకారమే నయీం ఎన్ కౌంటర్: మీడియాకు డీజీపీ ప్రకటన
నయీం ఎన్కౌంటర్ తర్వాత కూడా మెషిన్ గన్లను చేతబట్టుకుని పెట్రోల్ పంపు వద్ద కూడా వాటిని చేతుల్లో పట్టుకునే కనిపించారు. మలీనియం టౌన్షిప్లో నయీం బస చేసిన ఇంటి వద్ద యాక్షన్లోకి దిగిన పోలీసులు అక్కడ ఉన్న రోడ్ డివైడర్లు, చెట్లను రక్షణగా చేసుకుని అటాకింగ్ మొదలుపెట్టారు.
నయీం ఎన్కౌంటర్ను యువ ఐపీఎస్ అధికారిణి రమా రాజేశ్వరి నేరుగా కార్యరంగంలోకి దిగి ఈ ఆపరేషన్ను పర్యవేక్షించారు. ముందుగా నయీం గన్మెన్ కాల్పులతో అప్రమత్తమైన గ్రేహౌండ్స్ పోలీసులు చాకచక్యంగా ఇంటిని చేరుకుని కాల్పులు జరిపారు. మెషిన్ గన్లను చేతబట్టుకున్న పోలీసులు, చెట్లు, డివైడర్లు, గోడలను రక్షణగా చేసుకుని ముందుకు కదిలిన దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి.
మొత్తం 20 హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న నయీంపై 100కు పైగా కేసులున్నాయి. నయీం ఆగడాలపై సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యేల నుంచి ఫిర్యాదులు కూడా అందాయి. ఈ ఫిర్యాదుల ప్రకారం నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేను నయీం టార్గెట్ చేశాడని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో సోమవారం ఉదయం నయీం ఎన్కౌంటర్తో రాజకీయన నేతలు ఊపిరి పీల్చుకున్నారు. భూదందాలు, సెటిల్ మెంట్లలో ఆరితేరిన నయీమ్ తాజాగా తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలపై బెదిరింపులకు దిగాడు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని బెదిరించిన నయీం తన అనుమతి లేనిదే నియోజకవర్గంలో కాలు మోపరాదని ఆంక్షలు విధించాడు.
నయీం ఆగడాలు పెరిగిపోతుండటంతో భువనగిరి ఎమ్మెల్యే శేఖర్రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫిర్యాదు చేశారు. నయీం నుంచి ప్రాణహానీ ఉండటంతో భువనగిరి ఎమ్మెల్యేకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే.
ట్విస్ట్: షాద్నగర్లో ఉగ్రవాదులు కాదు... నయీం హతం, ఎవరితను? (పిక్చర్స్)
అయితే ఇలా ఎంతకాలం బిక్కుబిక్కుమంటూ బతుకు వెళ్లదీస్తామన్న ఎమ్మెల్యేల వాదనతో ఏకీభవించిన సీఎం కేసీఆర్... నయీం వేట కోసం గ్రైహౌండ్ బలగాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అప్పటికే నయీం కార్యకలాపాలపై కాస్తంత గుర్రుగా ఉన్న గ్రేహౌండ్స్ బలగాలు... కేసీఆర్ నుంచి ఆదేశాలు రాగానే వెనువెంటనే రంగంలోకి దిగిపోయాయి.
నయీం తలదాచుకున్న షాద్నగర్లోని ఇంటిని చుట్టుముట్టి అతడిని ఈరోజు ఉదయం అంతమొందించాయి. నయీం సోదరుడు అలీభాయ్ ఉత్సవ కమిటీ పేరుతో నిర్వహించే వినాయకుడి ఉత్సవాలకు రావాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నయీం గతంలో అల్టిమేటం జారీ చేశారంటూ వార్తలు కూడా వస్తున్నాయి.