గ్యాంగ్స్టర్ నయీం ఆస్తులివే: ఆ 97 ఆస్తుల వివరాలివ్వాలి: ఐటీ శాఖ
గ్యాంగ్స్టర్ నయీం ఆస్తులపై ఐటీశాఖ కన్నేసింది.97 ఆస్తుల ఆదాయ వ్యయాలను సమర్పించాలని ఐటీశాఖ నోటీసులు నయీం కుటుంబసభ్యులకు నోటీసులు జారీచేసి ఐటీశాఖ
భువనగిరి:గ్యాంగ్స్టర్ నయీం కూడబెట్టిన అక్రమాస్తులపై ఆదాయపు పన్ను శాఖ కన్నేసింది. ఈ ఆస్తులను ఎలా సంపాదించారో చెప్పాలంటూ ఆదాయపు పన్నుశాఖ నయీం కుటుంబసభ్యులకు నోటీసులు జారీచేసింది. నయీం కుటుంబసభ్యుల పేరు మీద రిజిస్టరైన 97 ఆస్తులపై వివరాలను వెల్లడించాలని భువనగిరిలో నయీం ఇంటికి నోటీసు అంటించారు ఆదాయపు పన్ను శాఖాధికారులు.
బెదిరింపులు.. కిడ్నాప్లు.. బలవంతపు వసూళ్లు.. భూ ఆక్రమణలతో వందల కోట్లు కూడ బెట్టి బినామీ పేర్లతో భద్రపర్చాడు గ్యాంగ్స్టర్ నయీంపై ఆరోపణలున్నాయి. ఈ విషయమై నయీంపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు కూడ నమోదయ్యాయి.
గత సంవత్సరం పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన నయీం బినామీ ఆస్తులపై ఎట్టకేలకు ఆదాయపు పన్నుశాఖ కొరడా ఝులిపించేందుకు వేగంగా చర్యలు తీసుకుంటోంది.. కుటుంబసభ్యుల పేరున రిజిస్ట్రేషన్లు చేయించిన 97ఆస్తుల తాలుకా వివరాలు వెల్లడించాలని ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది..
నయీం తమ ఆస్తులను బలవంతంగా రాయించుకొన్నాడని ఆరోపణలు చేసినవారు కూడ ఉన్నారు.ఈ మేరకు కేసులు కూడ నమోదయ్యాయి.అయితే నయీం కుటుంబసభ్యుల పేర్ల మీద ఉన్న ఆస్తులపై ఐటీ శాఖ కన్నేసింది.
97 ఆస్తులపై ఐటీ శాఖ ఆరా
గత ఏడాది ఆగష్టు 8వ, తేదిన గ్యాంగ్స్టర్ నయీం షాద్నగర్ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడు. నయీం కుటుంబసభ్యులపై 97 ఆస్తులు నమోదైనట్టుగా ఆదాయపు పన్నుశాఖాధికారులు గుర్తించారు.నయీం తల్లి తాహేరా భేగం పేరున ఉన్న 26, అక్క సలీమా భేగం పేరిట ఉన్న 20, మొదటి భార్య హసీనా భేగం పేరిట ఉన్న 23, మరో భార్య అహేలా భేగం పేరున ఉన్న 24, సమీప కుటుంబ సభ్యురాలు హీనా కౌసర్ పేరున ఉన్న5 మొత్తం 97ఆస్తులకు సంబంధించిన లావాదేవీల వివరాలను అందించాలని లావాదేవీల నిషేద చట్టం 1988 సెక్షన్ 23 కింద ఆదాయపు పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ బ్రిజేంద్ర కుమార్ నోటీసులు జారీ చేశారు.
నయీం కుటుంబ సభ్యులెక్కడ?
బినామీ ఆస్తుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నయీమొద్దీన్ కుటుంబ సభ్యులు ఐదుగురు అందుబాటు లో లేకపోవడంతో సోమవారం భువనగిరి పట్టణంలోని ఖాజా మహల్లాలోని నయీమోద్దీన్ నివాస భవనానికి స్థానిక పోలీసుల సహయంతో అంటించి వెళ్లారు. వందల మంది బాధితులు న్యాయం కోసం ప్రత్యేక దర్యాప్తు బృం దం, స్థానిక పోలీసులను ఆశ్రయించారు. అయితే ఫిర్యాదులపై ఇప్పటికే భూ ఆక్రమణలు, బెదిరింపులు, బలవంతపు వసూళ్లకు పాల్పడినందుకు కుటుంబ సభ్యుల పై పోలీసులు పలుకేసులు నమోదు చేశారు. నయీం ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కొంతకాలానికి ఆయన కుటుంబసభ్యులు భువనగిరిలో ఉండడం లేదని స్థానికులు చెబుతున్నారు.
ఆదాయ వివరాలను ఇవ్వాల్సిందే
నయీం కుటుంబసభ్యులకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడంతో ఈ కేసుపై మరోసారి ప్రాధాన్యత నెలకొంది.బినామీ ఆస్తులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నందున చేస్తున్న వ్యాపార కార్యకలాపాలు, ఆదాయ వనరులు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, 15 సంవత్సరాల ఆదాయం పన్ను రిటర్న్స్, పది సంవత్సరాలుగా జరిపిన చరస్థిర ఆస్తుల క్రయ, విక్రయ లావాదేవీల వివరాలు, బ్యాంకు లావాదేవీల వివరాలను అక్టోబరు 3వ తేదీలోపు హైదరాబాద్ ఆదాయ పన్ను శాఖకు అందించాలని ఆదేశించారు.
బినామీ ఆస్తులివేనా?
ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన బినామీ ఆస్తుల నోటీసుల్లో భువనగిరి, యాదగిరిగుట్ట, అవుషాపూర్, కుందనపల్లి, హైదరాబాద్, ఆదిభట్ల, షంషాబాద్, సరూర్నగర్, మిర్యాలగూడ, నల్లగొండ, ద్వారకానగర్, అబ్దుల్లాపూర్ మెట్, చౌటుప్పల్ ప్రాంతాల్లోని వందల ఎకరాల విలువైన భూములు, పదుల సంఖ్యలో భవనాలు, ఇండ్ల స్థలాలు ఉన్నాయని ఆదాయపు పన్నుశాఖాధికారులు ప్రకటించారు.
సమాచారం ఇవ్వాల్సిందే
తాము అడిగిన సమాచారం ఇవ్వాల్సిందేనని ఐటీ శాఖాధికారులు ఆ నోటీసులో పేర్కొన్నారు. సమాచారం అందించటంలో విఫలమైనా.. తప్పుడు వివరాలు అందించినా.. బినామీ లీవాదేవీల నిషేధిత చట్టం కింద జరిమాన విధిస్తామని ఆదాయపుపన్ను శాఖాధికారులు ప్రకటించారు.యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో వేల ఎకరాలు భూములను, వందల నివాస భవనాలను అక్రమంగా సంపాదించి తమ కుటుంబ సభ్యులు, గ్యాంగ్ సభ్యులపేరున రిజిస్ట్రేషన్లు చేయించినట్లు ఆరోపణలున్నాయన్నారు.