సెటిల్మెంట్ చేస్తుండగా.. నయీం ప్రధాన అనుచరుడు శేషన్న అరెస్ట్
హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్తపేటలోని ఓ రెస్టారెంట్లో సెటిల్మెంట్ చేస్తుండగా.. పోలీసులు దాడి చేసి అతడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి ఓ పిస్తోలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అచ్చంపేటకు చెందిన శేషన్న.. కొంతకాలం పీపుల్స్ వార్ గ్రూపులో పనిచేసి ఆ తర్వాత లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. అయితే, అప్పట్నుంచి నయీం ప్రధాన అనుచరుడిగా కొనసాగుతూ.. బెదిరింపులు, హత్యలు, హత్యాయత్నాలు వంటి అనేక కేసుల్లో నయీంతోపాటు శేషన్న కూడా నిందితుడిగా ఉన్నాడు.
2016లో షాద్నగర్లో జరిగిన ఎన్కౌంటర్లో నయీం మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి శేషన్న పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.కొంతకాలం తరువాత బయటకు వచ్చి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతూ దందాలను కొనసాగిస్తున్నాడు. ఈక్రమంలో ఎట్టకేలకు శేషన్న జాడను పసిగట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా, శేషన్న దగ్గర 9ఎంఎం పిస్టల్ దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల దగ్గర ఉండే పిస్టల్ ఆయన దగ్గరకు ఎలా వెళ్లింది? ఇప్పటివరకు శేషన్నకు ఎవరు ఆశ్రయం కల్పించారు? సెటిల్మెంట్లు చేయటానికి ఎవరు సహకరిస్తున్నారు? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నయీం ఆస్తులు, డంప్లకు సంబంధించి అన్ని వివరాలు శేషన్నకు పూర్తిగా తెలుసని పోలీసులు భావిస్తున్నారు. శేషన్నను కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించనున్నారు.