నల్గొండలో రోడ్డు ప్రమాదం.. గ్యాంగ్స్టర్ నయీమ్ మేనకోడలు దుర్మరణం
గ్యాంగ్ స్టర్ నయీమ్ మేనకోడలు షాహేదా సాజిద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. నల్లగొండ నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా కేశరాజుపల్లి శివారులో కారు లారీని ఢీకొట్టింది. దీంతో షాహేదా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారు లారీని వేగంగా వెనుక నుంచి ఢీకొట్టిందని, అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. ప్రమాద సమయంలో కారును షాహేదానే డ్రైవ్ చేస్తున్నట్టు సమాచారం. షాహేదా మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్కు చెందిన బెస్త కిష్టయ్య, జోడు ఆంజనేయులు జంట హత్య కేసుల్లో సాజిద్ నిందితురాలిగా ఉంది. నయీమ్ చేసిన పలు హత్య కేసులు,దందాల్లోనూ ఆమె విచారణ ఎదుర్కొంటోంది.
కాగా, 2016లో హైదరాబాద్ నగర శివారు ప్రాంతం షాద్నగర్లోని మిలీనియం టౌన్షిప్లో గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీంను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. నయీమ్ అక్కడ తలదాచుకున్నాడన్న సమాచారంతో పోలీసులు,గ్రేహౌండ్స్ అక్కడకు వెళ్లగా.. వారిపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో... ఆ ఎన్కౌంటర్లో అతను చనిపోయాడు. నయీమ్ ఎన్కౌంటర్తో అనేక వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఊపిరి పీల్చుకున్నారు. నక్సలైట్ నుంచి గ్యాంగ్స్టర్గా మారిన నయీమ్... దందాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, బెదిరింపుల ద్వారా వందల కోట్లు పోగేసినట్టు దర్యాప్తులో తేలింది.
నయీమ్ ఆస్తుల విలువ దాదాపు రూ.2వేల కోట్లు అని స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్(SIT) గతేడాది తేల్చింది. 1,019 ఎకరాల భూములు, 29 భవనాలు, 2 కేజీల బంగారం, రూ.2కోట్ల నగదు ఉన్నట్టు తేల్చింది.నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత.. ఈ ఆస్తులన్నీ కోర్టు అధీనంలోకి వెళ్లిపోయాయి. నయీమ్పై మొత్తం 251 కేసులు నమోదవగా.. వీటిలో 100 పైచిలుకు కేసుల్లో ఇప్పటికే విచారణ పూర్తయింది. మరికొన్ని కొలిక్కిరాని కేసులు కూడా ఉన్నాయి.