గ్యాంగ్స్టర్ నయీం తల్లి కూడా ఆ గలీజు దందాలు చేస్తోందా..? తాహెరాబేగం పై 12 కేసులు.. అరెస్ట్..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గ్యాంగ్ స్టర్ నయీం మరణించినా నయీం ముఠా కార్యకలాపాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. నాలుగు నెలల క్రితం నయీం బినామీ ఆస్తులను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన అనుచరులను, నయీం భార్యను పోలీసులు అరెస్టు చేశారు. నయీం భార్య హసీనా బేగం, గతంలో నయీం అనుచరుడుగా ఉన్న పాశం శ్రీనివాస్, మున్సిఫల్ కౌన్సిలర్ అబ్దుల్ నజీర్తో పాటు నయీం సమీప బంధువు ఫహీమ్ను కూడ అరెస్ట్ చేశారు పోలీసులు ఇక తాజాగా నయీం తల్లి తాహెరా బేగం ను అరెస్ట్ చేశారు పోలీసులు.
నయీం తల్లి తాహెరాబేగంను అరెస్ట్ చేసిన భువనగిరి పోలీసులు .. రిమాండ్ కు తరలింపు
పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమైన గ్యాంగ్స్టర్ నయీం తల్లి తాహెరాబేగంను భువనగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొడుకు నయీం లానే తాహెరా బేగం కూడా భూకబ్జాలు, బెదిరింపులు, కిడ్నాప్లు, మోసాలతోపాటు పలు నేరాలకు పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు. తాహెరాబేగంపై 12 కేసులు ఉన్నాయని తెలుస్తుంది . ఈ నేపథ్యంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు భువనగిరి సీఐ సురేందర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్ మండలం కుంట్లూరులో తాహెరాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో అండర్ వరల్డ్ డాన్గా పేరు పొందిన నయీం పోలీసుల చేతిలో హతం
తెలుగు రాష్ట్రాల్లో అండర్ వరల్డ్ డాన్గా పేరు పొందిన నయీం 2016లో షాద్నగర్ పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే . నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన నయీం ఓ గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుని చేసిన అరాచకం అంతా ఇంతా కాదు . రాజకీయ, ఆర్థిక సెటిల్ మెంట్లు చేస్తూ రాష్ట్రంలో సమాంతర ప్రభుత్వాన్ని నడిపాడు. దాదాపు రెండు దశాబ్దాలపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు నయీం . చివరకు పోలీసుల చేతిలో హతమయ్యాడు.
నయీం గ్యాంగ్ కార్యాకలాపాలపై పోలీసుల నిఘా .. తల్లి తాహెరా అరెస్ట్
నయీమ్ ఎన్ కౌంటర్ తర్వాత కొంతకాలం పాటు స్తబ్దంగా ఉన్న ఈ గ్యాంగ్ మళ్ళీ తమ కార్యాకలాపాలు ప్రారంభించటంతో పోలీసులు నిఘా పెట్టారు. నాలుగు నెలల క్రితం నయీం భార్యతో పాటు బంధువులను బినామీ ఆస్తులను తమ పేరు మీదకు మార్చుకుంటున్న క్రమంలో పట్టుకున్నారు. ఇక తాజాగా నయీం తల్లి తాహెరా బేగం ను సైతం అరెస్ట్ చేసి కటకటాలపాలు చేశారు పోలీసులు. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న రాచకొండ పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నయీం గ్యాంగ్ తో సంబంధం ఉన్న వారినే కాదు, నయీం పేరు మీద ఇప్పుడు దందాలు చేస్తున్న వారికి కూడా చెక్ పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.