నయీం ఎఫెక్ట్: నగరంలో 28 ఎకరాల భూమి, ఇళ్లలో పాచి పని చేస్తోంది
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం బాధితులు ఒక్కరొక్కరు బయటకు వస్తున్నారు. నయాం ఇతర రాష్ట్రాల్లోను అక్రమాలకు తెరదీశాడు. కానీ ప్రధానంగా రంగారెడ్డి, నల్గొండ జిల్లాలలో భూకబ్జాలకు పాల్పడ్డాడు. హైదరాబాదులోని ఎల్బీనగర్, ఇబ్రహీం పట్నం, ఆదిభట్లలోనూ పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి.
పన్నెండేళ్ల ఏళ్ల క్రితం నయీం తన 28 ఎకరాల భూమిని లాగేసుకున్నాడని, ఆ క్రమంలో తన భర్త,ను, కుమారుడ్ని అత్యంత కిరాతకంగా హత్య చేశాడని మల్లమ్మ అనే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆదిభట్లలో తమ బంధువులను కూడా భయబ్రాంతులకు గురిచేసి భూకబ్జాలకు పాల్పడ్డాడని తెలిపారు. కుటుంబ సభ్యులను కోల్పోవడంతో ఇతరుల ఇళ్లలో పాచిపని చేసి జీవనం సాగిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని, తనను ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
నయీం
కాగా, నయీం దర్యాప్తులో వెలుగు చూసిన ఆధారాలతో నయీం, అతని గ్యాంగ్పై కోరుట్ల, కరీంనగర్ పీఎస్ పరిధిలో నాలుగు కొత్త కేసులు నమోదు చేశారు. నయీం బాధితులు ముందుకు వచ్చి సమాచారం అందించి విచారణకు సహకరించాలని నాగిరెడ్డి అభ్యర్థించారు.
నయీం
నయీం, గ్యాంగ్ అరాచకాలపై ఫిర్యాదులకు వీలుగా ఏర్పాటు చేసిన సిట్ కంట్రోల్ నంబరు (9440627218) కు శనివారం వరకు అరవై మంది బాధితులు ఫోన్ చేసి తమకు జరిగిన అన్యాయాలను వివరించారు. బాధితులను ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఫిర్యాదు చేయాలని సూచించినట్లు, అలాగే ఈ ఫిర్యాదులపై కేసును నమోదు చేసుకుని వాటి వివరాలను సిట్కు పంపించాలని పోలీసుస్టేషన్ల సీఐలను ఆదేశించినట్లు నాగిరెడ్డి తెలిపారు.
నయీం
ఇదిలా ఉండగా, పోలీసులకు టోకరా ఇచ్చేందుకు నయీం మహిళ వేషధారణలో తిరిగే వాడని వెల్లడైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫొటోలు నయీం డెన్లో జరిపిన సోదాల్లో బయటపడ్డాయి.
నయీం
మహిళ వేషధారణ కోసం నయీం 17 రకాల శిరోజాల విగ్గులను సేకరించి పెట్టుకున్నాడని సిట్ అధికారులు గుర్తించారు. తాను మహిళ వేషధారణలో ఉంటూ తన వెంట కొంతమంది మహిళలను, చిన్న పిల్లలను వెంటపెట్టుకుని పోలీసుల కళ్ళు గప్పేవాడని సిట్ అధికారులు నిర్ధారించారు.