నయీం నీడలో ఓ మాజీ మంత్రి భూ దందాలు: సిట్ దర్యాప్తులో కీలక అంశాలు
హైదరాబాద్: కన్ను పడిన భూమిని లాక్కోవడం, నచ్చిన ఇంటిని ఆక్రమించుకునే గ్యాంగ్ స్టర్ నయీం కేసులో రోజుకో విషయం వెలుగు చూస్తోంది. సెటిల్మెంట్ల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బును సంపాదించిన నయీం తిరిగి ఆ సొమ్ముని వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెట్టి మరింత సొమ్ముని సంపాదించినట్లుగా తెలుస్తోంది.
సిట్ అధికారుల విచారణలో నయీంతోపాటు అతనితో కొందరు పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఫైనాన్స్ వ్యాపారాలు నడిపించినట్లు తెలుస్తోంది. బడా వ్యాపారులకు, పారిశ్రామికవేత్తలకు తమ ఫైనాన్స్ల నుంచే బలవంతంగా అప్పులు ఇచ్చినట్లు, అధిక వడ్డీ వేసి ఇవ్వకపోతే బెదిరింపులకు పాల్పడ్డట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కొందరు అధికారులు పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తున్నట్లు, ఉద్యోగులకు అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు.. పెద్ద వ్యాపారులను ఇతర ఫైనాన్స్ కంపెనీల వద్ద అప్పు తీసుకోకుండా తమ వద్దే తీసుకునేలా వీరు నయీం పేరును వాడుకున్నట్లు తెలుస్తోంది.
గతంలో భువనగిరిలో పనిచేసిన పోలీసు ఉన్నతాధికారి ఒకరు ఈ అక్రమ వ్యాపారాన్ని కొనసాగించినట్లు నయీం కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు ఆధారాలు దొరికియానే ప్రచారం జోరుగా మీడియాలో వినిపిస్తోంది. అయితే ఈ జాబితాలో స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
నయీంను అడ్డుపెట్టుకొని ఈ అధికారులు సాగించిన ఫైనాన్స్ దందాకు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలతోపాటు హైదరాబాద్లోనూ ఫైనాన్స్ సంస్థలు కుదేలైనట్లు, వ్యాపారం సాగక కంపెనీలు ఎత్తేసినట్లు సమాచారం. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో అనేక ఫైనాన్స్ కంపెనీలు దివాలా తీసినట్లు తెలుస్తోంది.
నయీంను అడ్డుపెట్టుకుని ప్రజాప్రతినిధులు కొందరు జోరుగా సెటిల్మెంట్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. శివారు ప్రాంతాలతోపాటు హైదరాబాద్ నగర ప్రజా ప్రతినిధులు కూడా నయీం పేరుతో లబ్ధి పొందినట్లు తెలుస్తోంది. ఓ మాజీ మంత్రి నయీంతో అనేక భూ దందాలు నిర్వహించినట్లు సిట్ అధికారులకు ఆధారాలు లభించాయి.
సదరు నేత నయీం పేరు ఉపయోగించి పలు నిర్మాణ సంస్థల్లో వాటాలు కూడా తీసుకున్నట్టు సమాచారం. మరో ప్రజాప్రతినిధి ఓ సెటిల్మెంట్ విషయంలో నయీంకు నజరానా అందించినట్లు, దీనికి ఓ రౌడీషీటర్ మధ్యవర్తిత్వం నెరిపినట్లు తెలిసింది.
బంజారాహిల్స్లోని సర్వే నెంబరు 403లో ఓ భూ సెటిల్మెంట్లో నయీం పేరును ప్రజాప్రతినిధులు వాడినట్టు అధికారులు గుర్తించినట్లు సమాచారం నయీం డైరీని పరిశీలించడంతోపాటు అతని అనుచరులను ప్రశ్నిస్తుండటంతో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
మాజీ నక్సలైట్ నుంచి గ్యాంగ్స్టర్గా ఎదిగిన నయీం మరింత డబ్బు సంపాదన కోసం పలు వ్యాపారాల్లో మదుపు చేసినట్టు విచారణలో తేలింది. ల్యాండ్ సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన డబ్బును వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టి మరింత సంపాదించాడు. పోలీసుల ఎన్కౌంటర్లో మరణించకపోయి ఉంటే విదేశాలకు వెళ్లి ఈ వ్యాపారాలను కొనసాగించాలని భావించాడని అతని అనుచరులు పోలీసులకు తెలిపారు.
ఇదిలా ఉంటే హైదరాబాద్ నగర రౌడీషీటర్లను బెదిరించి డబ్బు వసూలు చేసిన నయీం ఆ తరువాత కొందరితో దోస్తీ చేసి పలు సెటిల్మెంట్లకు సహకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. గ్యాంగ్స్టర్కు భయపడి డబ్బులిచ్చిన వారిలో కొంతమంది నయీం అడుగులకు మడుగులొత్తుతూ అతని నీడలో దందాను పది రెట్లు పెంచుకున్నట్లు తెలుస్తోంది.
నయీం ఎన్ కౌంటర్ వ్యవహారం మీడియాలో రావడంతో నయీంతో సంబంధాలున్న రౌడీషీటర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అనుచరులకు కూడా చెప్పకుండా అదృశ్యమైనట్లు తెలిసింది. వీరిపై పోలీసులు కూడా దృష్టి సారించారు. నయీంకు డబ్బులిచ్చిన వారు, లబ్ధి పొందినవారి జాబితాను సిద్ధం చేస్తున్నారు. అవసరమైతే వీరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించేందుకు సిట్ సిద్ధమైంది.