'స్వచ్ఛ హైదరాబాద్ అని చెప్పి, చెత్త హైదరాబాద్ చేసిన కెసిఆర్'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హైదరాబాదును స్వచ్ఛ హైదరాబాద్ చేస్తానని చెప్పి చెత్త హైదరాబాద్ చేశారని తెలుగుదేశం పార్టీ నేత పెద్దిరెడ్డి గురువారం నాడు మండిపడ్డారు. హైదరాబాదులో జిహెచ్ఎంసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు.
తమ డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన సమ్మె మరింత ధృతమైంది. ఔట్సోర్సు కార్మికుల జీతాల పెంపు, పెండింగ్లోన్న ప్రమోషన్లకు వెంటనే మోక్షం కలించాలన్న మొత్తం 16 డిమాండ్లతో ఎనిమిది కార్మికసంఘాలతో ఏర్పడిన ఐక్యకార్యచరణ ఈ నెల 5వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగింది.
సమ్మె కారణంగా నాలుగు రోజుల నుంచి నగరంలో పారిశుద్ధ్య పనులు స్తంభించాయి. ముఖ్యంగా రోడ్లు ఊడ్చే కార్మికులు ఎక్కువ సంఖ్యలో విధులు నిర్వర్తించకపోవటంతో అధికారులు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసినా, అవి సరైన ఫలితానివ్వకపోవటం, మరోవైపు రోడ్లపై చెత్తాచెదారం పేరుకుపోయాయి.
విఐపి జోన్లో చెత్త తరలింపు కష్టతరంగానే మారింది. అలాగే చెత్త సేకరణ, తరలింపు ప్రక్రియలపై కూడా సమ్మె ప్రభావం పడింది. పలు చోట్ల చెత్తను తరలించే వాహనాలను పలు యూనియన్ల నేతలు అడ్డుకున్నారు. సమ్మెతో పాటు కార్మికులు బుధవారం జిహెచ్ఎంసి సికిందరాబాద్ కార్యాలయంలో ధర్నా చేపట్టారు.