తెలంగాణలో టీడీపీ చచ్చిపోయింది: గట్టు, టీఆర్ఎస్కు వైసీపీ ఏజెంట్: ఉత్తమ్
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చచ్చిపోయిందని టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్ధల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఆ విషయం వెల్లడైందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై హైదరాబాద్లో స్పందించిన ఆయన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోందని వ్యాఖ్యానించారు.
టీడీపీతో జట్టు కట్టడం వల్లే నల్గొండలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ఆయన స్పష్టం చేశారు. కాగా డిసెంబర్ 27వ తేదీన జరిగిన స్థానిక సంస్ధల కోటా ఎన్నికల ఫలితాలు బుధవారం ప్రకటించారు. ఈ ఎన్నికల్లో మొత్తం టీఆర్ఎస్ 10 స్థానాలు కైవసం చేసుకోగా, కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలను కైవసం చేసుకుంది.
అందరి అభిప్రాయాలు తీసుకుంటాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకాభిప్రాయం మేరకే టికెట్ల పంపిణీ జరుగుతుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కలిసికట్టుగా ముందుకు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను గెలవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల ఓటమికి గల కారణాలను సమీక్షించుకుంటామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని టీఆర్ఎస్ భావిస్తోందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి వైసీపీ ఏజెంట్లా వ్యవహారిస్తోందని మండిపడ్డారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. మా గెలుపు మార్పు నాంది అని త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికల్లో కూడా విజయం మాదేనన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గ్రేటర్ అభ్యర్దుల ఎంపిక కోసం సర్వే చేస్తున్నామన్నారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన వివరించారు.
డివిజన్, బూత్ స్థాయి నాయకులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అంతకముందు ఉత్తమ్కుమార్ నివాసంలో కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి, దానం, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉప్పల్లో జరిగిన గొడవపై వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.