అమాయకులను మోసం చేస్తున్న 'గవ్వల' బాబా అరెస్ట్!
గవ్వలు వేస్తూ.. తన మాయ మాటలతో అమాయక ప్రజలను మోసం చేస్తూ డబ్బులు గుంజుతున్న ‘గవ్వల’బాబా అలియాస్ నడిగొట్టు రాజేష్ను టాస్క్ఫోర్స్ పోలీసులు ఎట్టకేలకు మంగళవారం అరెస్టు చేశారు.
కరీంనగర్: సంతానం లేని వారికి సంతానం పుట్టేలా చేస్తానంటాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తానంటాడు. అనారోగ్యంతో బాధపడేవారిని ఆరోగ్య వంతులను చేస్తానంటాడు. అతడి మాటలు నమ్మారా.. అంతేసంగతులు!
ఈ ప్రబుద్ధుడి పేరు నడిగొట్టు రాజేష్. కానీ గవ్వల బాబాగా పేరుగాంచాడు. గవ్వలు వేస్తూ.. తన మాయ మాటలతో అమాయక ప్రజలను మోసం చేస్తూ డబ్బులు గుంజుతుంటాడు. చివరికి పాపం పండి టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డాడు.
పోలీసులు కథనం ప్రకారం.. కరీంనగర్లోని ఇందిరమ్మ కాలనీ రేకుర్తికి చెందిన నడిగొట్టు రాజేష్, తన దగ్గరకు పలు సమస్యలతో వచ్చే వారి పేరిట గవ్వలు వేస్తుంటాడు. గవ్వలు వేయగా వచ్చే సంఖ్యను ఆధారంగా చేసుకుని 'మీకు మంచి జరగదు' అని చెప్పి.. పూజలు చేయాలని, తాయత్తులు కట్టాలని చెబుతూ వారిని ప్రలోభ పెట్టి డబ్బులు గుంజుతుంటాడు.
ఇతడి బారినపడి మోసపోయిన పలువురు ఫిర్యాదు చేయడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు గవ్వల బాబాపై అలియాస్ రాజేష్పై దృష్టి సారించారు. అతడి కదలికలపై నిఘా వేసిన పోలీసులు ఎట్టకేలకు మంగళవారం పట్టుకున్నారు. స్థానిక కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో రాజేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.