విషాదం:పెళ్ళైన గంటల్లోనే వధువు మృతి,ఏమైందంటే?
సూర్యాపేట: పెళ్ళైన కొద్ది గంటల్లోనే వధువు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకొంది.వివాహం సందర్భంగా వధూవరులను ఊరేగింపు సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకొంది. వివాహమైన కొద్ది గంటల్లోనే వధువు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన హన్మయ్య, పుష్పలతల కూతురు గాయత్రికి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురుకు చెందిన గుండా వేణుతో శనివారం నాడు వివాహం చేశారు.
సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హల్లో వివాహం చేశారు. వివాహమైన తర్వాత బంధు మిత్రులను నూతన వధూవరులను ఆశీర్వదించారు. వధువును అత్తారింటికి పంపేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.
సంప్రదాయం ప్రకారంగా నూతన వధూవరులను ఊరేగింపుగా దేవాలయానికి తీసుకెళ్ళారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం నుండి బయటకు రాగానే నూతన వధువు గాయత్రి కుప్పకూలింది. హుటాహుటిన ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు.
ఆమెను పరీక్షించిన వైద్యులు గాయత్రి మృతి చెందిందని ప్రకటించారు.పెళ్ళైన కొద్ది గంటల్లోనే వధువు మరణించడంతో ఆ కుటుంబంలో విషాధం నెలకొంది. గాయత్రి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.