బన్నీ సినిమాల్లో ఛాన్స్ పేరుతో యువతుల ట్రాప్.. సైబర్ క్రైమ్కు గీతా ఆర్ట్స్ ఫిర్యాదు...
ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పేరు చెప్పి యువతులను మోసగిస్తున్న ఓ వ్యక్తిపై ఆ సంస్థ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అల్లు అర్జున్ సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి పలువురు యువతులకు అతను సోషల్ మీడియా ద్వారా వల వేశాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
బన్నీ సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానని...
గీతా ఆర్ట్స్ సంస్థలో తాను డిజైనర్, మేకప్ మేన్ అని చెప్పుకుంటూ కొంతకాలంగా ఓ వ్యక్తి సోషల్ మీడియాలో అమ్మాయిలకు గాలం వేస్తున్నాడు. తనకు బన్నీ చాలా క్లోజ్ అని,అతని సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి పలువురు అమ్మాయిలను మోసగిస్తూ వస్తున్నాడు. ఈ విషయం ఇటీవల గీతా ఆర్ట్స్ సంస్థకు తెలియడంతో ఆ నిర్మాణ సంస్థ అప్రమత్తమైంది.
గీతా ఆర్ట్స్ మేనేజర్ ఫిర్యాదు
గీతా ఆర్ట్స్ మేనేజర్ సత్య హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.తమ బ్యానర్ పేరు చెప్పి అమ్మాయిలను మోసం చేస్తున్న ఆ వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదు చేశారు. బాధిత యువతులతో అతను మాట్లాడిన వాట్సాప్ ఫోన్ నంబర్ను కూడా పోలీసులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునే పనిలో పడ్డారు. ఫోన్ నంబర్ ఆధారంగా అతని లొకేషన్ ట్రేసింగ్ చేసే పనిలో ఉన్నారు.
ఆ గ్యాంగ్ పనేనా..?
ఇటీవల ఆర్.ఎక్స్ 100' మూవీ ఫేమ్,దర్శకుడు అజయ్ భూపతి పేరుతో కొందరు సోషల్ మీడియాలో అమ్మాయిలను మోసం చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందిన సంగతి తెలిసిందే. అజయ్ భూపతి పేరుతో మోసం చేయాలని చూసిన గ్యాంగే... ఇప్పుడు గీతా ఆర్ట్స్ పేరుతో కూడా అమ్మాయిలను మోసం చేస్తుందోమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. తాజా కేసులో నిందితుడు కేవలం వాట్సాప్ కాల్ ద్వారానే మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో లొకేషన్ ట్రేసింగ్ కోసం సైబర్ క్రైమ్ పోలీసులు వాట్సాప్ సంస్థకు లేఖ రాసే అవకాశం ఉంది.
Recommended Video
గతంలో విజయ్ దేవరకొండ పేరుతోనూ...
గతంలో హీరో విజయ దేవరకొండ పేరుతోనూ ఇలాగే ఓ వ్యక్తి మోసాలకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ పేరుతో ఓ ఖాతా తెరిచి... తానే విజయ్ దేవరకొండ అన్నట్లుగా కొంతమంది యువతులను నమ్మించాడు. ఆ తర్వాత ప్రేమ,పెళ్లి,సహజీవనం అంటూ వారిని ట్రాప్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం విజయ్ దృష్టికి వెళ్లడంతో ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసుపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఒకటి,రెండు రోజుల్లోనే నిందితుడు సాయి కిరణ్ను కామారెడ్డిలో అరెస్ట్ చేశారు.