బాబు, కేసీఆర్ ప్రభుత్వాలపై రామ్చరణ్ సతీమణి ఉపాసన, గొప్ప అవకాశమని మంచు లక్ష్మీ
హెచ్ఐసిసిలో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్ప్రెన్యూయర్షిప్ సమ్మిట్కు ఏపీ మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి, నటుడు రామ్ చరణ్ తేజ సతీమణి ఉపాసన, నటి మంచు లక్ష్మి తదితరులు హాజరయ్యారు.
హైదరాబాద్: హెచ్ఐసిసిలో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్ప్రెన్యూయర్షిప్ సమ్మిట్కు ఏపీ మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి, నటుడు రామ్ చరణ్ తేజ సతీమణి ఉపాసన, నటి మంచు లక్ష్మి తదితరులు హాజరయ్యారు. ప్రధాని మోడీ, ఇవాంకా ట్రంప్లు చేరుకోకముందే వారు హెచ్ఐసిసికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా వారు వివిధ మీడియా ప్రతినిధులతో వారు మాట్లాడారు. మహిళా పారిశ్రామికవేత్తల్లో ఈ సదస్సు స్ఫూర్తి నింపుతుందని, చిన్న సంస్థల్లో మహిళలకు ప్రోత్సాహం తక్కువగా ఉందని, ప్రతి సంస్థలో ఓ మహిళ డైరెక్టర్గా ఉండాలని బ్రాహ్మణి అన్నారు.
మహిళలకు స్వేచ్ఛ ఇస్తే మంచి ఫలితాలు
మహిళలకు స్వేచ్ఛ ఇస్తే మంచి ఫలితాలు సాధిస్తారని బ్రాహ్మణి ్న్నారు. ప్రపంచంలో చాలా అవకాశాలు ఉన్నాయనే విషయం ఈ సదస్సు ద్వారా మరోసారి వెల్లడి అవుతుందన్నారు. ఈ సదస్సు నుంచి మహిళలకు మద్దతు లభిస్తుందని తాను అనుకుంటున్నానని, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మహిళలకు మద్దతు లభిస్తోందన్నారు. ప్రతి మహిళ స్వతంత్రంగా ఎదగాలని, ఏదైనా పల్లెల నుంచి ప్రారంభం కావాలన్నారు.
ప్రోత్సాహం కావాలని ఉపాసన
మహిళలకు ప్రోత్సాహం కావాలని ఉపాసన అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు మహిళలకు పెద్దపీట వేస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ఉపయోగకరంగా, ప్రోత్సాహకరంగా ఉన్నాయని చెప్పారు. మహిళలకు అవకాశాలు ఇస్తే ప్రపంచ గతిని మార్చివేస్తారన్నారు.
ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని కలిసినప్పుడు
ఇలాంటి గొప్ప సదస్సులో వ్యక్తులను కలిసినప్పుడు వారి నుంచి చాలా నేర్చుకోవచ్చునని మంచు లక్ష్మి అన్నారు. గ్లోబల్ ఎంటర్ప్రెన్యూయర్షిప్ సమ్మిట్కు రావడం ఆనందంగా ఉందని చెప్పారు. అందరితో కలిసి మాట్లాడేందుకు తనకు గొప్ప అవకాశం దక్కిందన్నారు.
ప్రముఖులు హాజరు
కాగా, హైటెక్స్లోని హెచ్ఐసీసీలో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ప్రారంభమైన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతోపన్యాసం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంక ట్రంప్, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రులు నిర్మలాసీతారామన్, సుష్మాస్వరాజ్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, హెరిటేజ్ ఫుడ్స్ ఈడీ నారా బ్రాహ్మణి, ఆపోలో ఫౌండేషన్ వైస్ చైర్పర్సన్ ఉపాసన, సినీనటి మంచు లక్ష్మి, జీఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు, దాదాపు 150 దేశాలకు చెందిన ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు.