కొత్త నోటిఫికేషన్లు జారీ, ఇంకా చేస్తాం: ఘంటా చక్రపాణి శుభవార్త
హైదరాబాద్: నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్పిఎస్సీ) చైర్మన్ ఘంటా చక్రపాణి శుభవార్త వినిపించారు. టీఎస్పీఎస్సీ ఏర్పడి సోమవారానికి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసింది.
మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీఎస్పీఎస్సీ ఉద్యోగ సమాచారం వెబ్ సంచికను రూపొందించారు. వెబ్ సంచికను తెలంగాణ స్టేట్ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రారంభించారు.
దేశానికే ఆదర్శంగా నిలిపాం...
టీఎస్పీఎస్సీని దేశానికే ఆదర్శంగా నిలిపామని ఘంటా చక్రపాణి చెప్పారు. సోమవారంనాడు ఆరోగ్యశాఖకు సంబంధించి రెండు నోటిఫికేషన్లను విడుదల చేశామన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కంప్యూటరీకరణ పనులు కొనసాగుతున్నాయని, త్వరలోనే గురుకులాలకు సంబంధించిన, ఇతర నోటిఫికేషన్లకు సంబంధించిన ఫలితాలను వారం, పదిరోజుల్లో వెల్లడిస్తామని చెప్పారు. 2018 సంవత్సరంలో మరికొన్ని నోటిఫికేషన్లను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
మూడేళ్లలో ఇన్ని పోస్టుల భర్తీ..
మూడేళ్లలో 5932 పోస్టులు భర్తీ చేసి నియామక పత్రాలు అందించామని ఘంటా చక్రపాణి చెప్పారు. 165 పరీక్షలు నిర్వహించామని చెప్పారు.. 13,865 ఖాళీల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉందన్నారు. వీటిలో 8,657 పోస్టులకు అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతోందని, వారంలో పీజీటీ, తర్వాత టీజీటీ పోస్టుల ఫ లితాలు వెల్లడిస్తామని అన్నారు. జనవరిలో మిగతా పోస్టుల ఫలితాలు వెల్లడించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఇంత..
టీఎస్పీస్పీ ద్వారా 18.64 లక్షల మంది వన్టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఘంటా చక్రపాణి తెలిపారు. అభ్యర్థులకు అదనపు సమాచారం ఇచ్చేందుకు త్వరలో పూర్తి స్థాయి హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. నియామకాల్లో టీఎస్పీస్పీ దేశంలోనే అగ్ర స్థానంలో ఉందని కమిషన్ సభ్యుడు విఠల్ చెప్పారు.
30 వేల పోస్టులకు నోటిఫికేషన్
2004-14 మధ్య ఏపీపీఎస్సీ ద్వారా 23 జిల్లాల్లో భర్తీ అయిన ఉద్యోగాలు 25 వేలేనని, టీఎ్సపీఎస్సీ ద్వారా మూడేళ్లలోనే 30 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామని విఠల్ చెప్పారు.. రాష్ట్ర ఆర్థికశాఖ 63 వేల పోస్టులకు క్లియరెన్స్ ఇవ్వగా.. 30 వేల పోస్టులు కమిషన్ ద్వారా భర్తీ అవుతున్నాయన్నారు. పోలీసు, సింగరేణి, విద్యుత్, ఆర్టీసీ శాఖల ద్వారా 20 వేల ఉద్యోగాలు భర్తీ అయ్యాయని వివరించారు.అంటే ప్రభుత్వం ప్రకటించిన వాటిలో సగం ఉద్యోగాల భర్తీ ప్ర క్రియ పూర్తయినట్లే అన్నారు.
ఉద్యోగాల కల్పనపై అల్లం నారాయణ
ఉద్యోగాల కల్పన ప్రభుత్వాల బాధ్యత అని, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా టీఎస్పీఎస్సీ పోస్టులు భర్తీ చేస్తోందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చెప్పారు. ఆయన టీఎ్సపీఎస్సీ రూపొందించిన ‘ఉద్యోగ సమాచారం' వెబ్ జర్నల్ను ఆవిష్కరించారు.
200 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ
వైద్య, ఆరోగ్యశాఖలోని ల్యాబ్టెక్నీషియన్ గ్రేడ్-2 కేటగిరీలో 200పోస్టులకు టిఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. స్త్రీ, శిశు సంక్షేమశాఖలోని ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-1 సూపర్వైజరీ కేటగిరీలో 79 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది టీఎ్సపీఎస్సీ సోమవారం వెల్లడించిన 99వ నోటిఫికేషన్.