ఘట్కేసర్ రేప్ కేసు : స్పృహలోకి బాధితురాలు.. గాంధీకి తరలింపు.. వైద్యులు ఏం చెప్తున్నారు...
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో బీఫార్మసీ విద్యార్థిని అత్యాచారం కేసు సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటనలో బాధితురాలిపై అత్యాచారం జరిగిందా లేదా అన్న విషయంపై ఇప్పటికైతే స్పష్టత రాలేదు. బాధితురాలికి సంబంధించిన మెడికల్ రిపోర్టులు వస్తేనే ఈ విషయంలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గురువారం(ఫిబ్రవరి 11) బాధితురాలు స్పృహలోకి రావడంతో ఆమెను నారపల్లి క్యూర్ ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం తిరిగి క్యూర్ ఆస్పత్రికి తరలించనున్నారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై క్యూర్ ఆస్పత్రి వైద్యులు మీడియాకు వివరాలు వెల్లడించారు.
అత్యాచారం జరగలేదు : డా.రణధీర్ రెడ్డి
క్యూర్ ఆస్పత్రి డాక్టర్ రణధీర్ రెడ్డి మాట్లాడుతూ... ఫార్మసీ విద్యార్థినిని బుధవారం రాత్రి 8:20గంటలకు తమ ఆస్పత్రిలో చేర్చినట్లు చెప్పారు. అప్పటికే ఆమె అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలిపారు. బాధితురాలి ఒంటిపై కొన్ని చోట్ల గాయాలు అయ్యాయన్నారు. రాడ్లతో విద్యార్థినిపై దాడి చేయడం వల్ల కాలుకు గాయం అయ్యిందన్నారు. విద్యార్థినిపై అత్యాచారం జరగలేదని.. దుండగులు అత్యాచారయత్నం చేశారని అన్నారు. బాధితురాలికి సీనియర్ గైనకాలజిస్ట్ అన్ని వైద్య పరీక్షలు చేశారని చెప్పారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి బాగానే ఉందని... వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారని చెప్పారు.
ఇప్పుడే చెప్పలేమన్న జిల్లా అధికారి...
జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ అధికారి జ్యోతి ఈ ఘటనపై మాట్లాడుతూ... ఈ విషయం తెలియగానే నారపల్లి క్యూర్ ఆస్పత్రికి చేరుకున్నామన్నారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం బాగానే ఉందన్నారు. మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫార్మసీ విద్యార్థినిపై దాడి జరిగిందా లేదా అన్నది రిపోర్టులు వచ్చాకే వెల్లడిస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వ్యక్తుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు సకాలంలో స్పందించడం వల్లే విద్యార్థిని క్షేమంగా ఉందన్నారు.ఘటకేసర్ ఘటన పైన స్త్రీ-శిశు సంక్షేమ శాఖకు నివేదిక అందజేస్తామన్నారు.
కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుండగా...
మేడ్చల్లోని ఓ కాలేజీలో బీఫార్మసీ చదువుతున్న బాధితురాలు బుధవారం సాయంత్రం 6.05గం. సమయంలో ఇంటికి వెళ్లేందుకు ఓ ఆటోలో ఎక్కింది. అయితే ఆమె దిగాల్సిన చోట ఆపకుండా ఆ డ్రైవర్ ఆటోను వేగంగా ముందుకు పోనిచ్చాడు. దీంతో కంగారుపడ్డ యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వెంటనే కీసర,ఘట్కేసర్ పోలీసులు రంగంలోకి దిగారు. అమ్మాయి ఫోన్ ఆన్లోనే ఉండటంతో లొకేషన్ ట్రాక్ చేసి అన్నోజిగూడ సమీపంలో ఉన్నట్లు గుర్తించారు.
స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న పోలీసులు
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి దుండగులు పరారయ్యారు. అప్పటికే అపస్మారక స్థితిలో బాధితురాలు వివస్త్రగా ఉండటాన్ని గుర్తించారు. వెంటనే ఆమెను ప్యాట్రోల్ నారపల్లిలోని క్యూర్ ఆస్పత్రికి తరలించారు. గురువారం(ఫిబ్రవరి 11) ఆమె స్పృహలోకి రావడంతో పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు.