గజల్ శ్రీనివాస్ తొలుత మొరాయింపు: ఇప్పుడు ఖైదీలకు వినోదం
హైదరాబాద్: లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి హైదరాబాదులోని చంచల్గుడా జైలులో గజల్ శ్రీనివాస్ ఇప్పుడు తోటి ఖైదీలతో కలిసిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. లైంగిక వేధింపుల కేసులో చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న గజల్ శ్రీనివాస్ ఖైదీలకు గజల్స్ వినిపిస్తున్నారని సమాచారం.
శనివారం జైలులో జరిగిన యోగా శిక్షణాశిబిరం ప్రారంభోత్సవంలో గజల్స్ పాడి తోటి ఖైదీలను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. జైలుకు వచ్చిన మొదటి రెండు రోజులపాటు భోజనం చేయకుండా దిగులుగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు భోజనం తీసుకుంటున్నారు..
గజల్ శ్రీనివాస్ ప్రస్తుతం భోజనాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తన బ్యారక్లో ఉన్న ఖైదీలతోనూ కలిసిపోతున్నట్లు కూడా చెబుతున్నారు. జైలుకు వచ్చినప్పటి నుంచి అతడి సతీమణి, కుమార్తె ములాఖత్కు రాలేద కూడా తెలుస్తోంది. అతడి తరఫు న్యాయవాది, బంధువులు మాత్రమే వచ్చి కలిసిపోయారు.
పోలీసు కస్టడీకి నో
లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన గాయకుడు గజల్ శ్రీనివాస్ను తమ కస్టడీకి ఇవ్వాలన్న పంజాగుట్ట పోలీసుల పిటిషన్ను గురువారం నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ కొట్టివేయడానికి కారణం కూడా ఉంది. ఓ యువతిని వేధించిన కేసులో అతను అరెస్టై చంచల్ గూడ జైల్లో ఉన్న విషయం తెలిసిందే.
అతన్ని ఇంకా విచారించేది ఏముంది..
రిమాండ్ రిపోర్టులో విచారణకు సంబంధించిన వివరాలను పొందుపరిచి, వీడియోలతో సహా అన్ని ఆధారాలనూ సంపాదించిన తర్వాత ఆయనను ఏం విచారిస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు.
కస్టడీ అవసరం లేదని...
గజల్ శ్రీనివాస్ నుంచి ఎటువంటి రికవరీ అవసరం లేదని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు కాబట్టి కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. కస్టడీ పిటిషన్ను తిరస్కరించిన నేపథ్యంలో శుక్రవారం అతను మళ్లీ వేసిన బెయిల్ పిటిషన్ పైన వాదనలు జరగనున్నాయి.