వికెట్ డౌన్: జిహెచ్ఎంసిలో డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ సస్పెన్షన్
హైదరాబాద్: జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్ (మెయింటెనెన్స్) విభాగంలో పని చేసే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ (డీసీఈ) శ్రీనివాస్ పైన సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు జిహెచ్ఎంసి కమిషనర్ డాక్టర్ జనార్దన్ రెడ్డి ప్రకటించారు.
జిహెచ్ఎంసి పరిధిలోని సర్కిళ్లు, జోన్ల పరిధిలో రోడ్ల నిర్మాణానికి ఎక్కడికక్కడే టెండర్లు పిలుస్తారు. అక్కడే పనులను పూర్తి చేస్తారు. వాటి పురోగతి వివరాలను మాత్రం అక్కడి ఈఈలు, ఎస్ఈలు ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని చీఫ్ ఇంజనీరు (మెయుంటెనెన్స్) వద్ద పని చేసే డీసీఈ శ్రీనివాస్కు తెలియజేస్తారు.
సర్కిళ్లు, జోన్ల నుంచి అధికారులు చెప్పిన వివరాలను యథాతథంగా ఆయన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)కి అందిస్తారు. సీజీజీ అధికారులు దానిని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు.
వెబ్సైట్లో తప్పుడు వివరాలు అప్లోడ్ చేసినందుకు బాధ్యుడిని చేస్తూ అతనిని సస్పెండ్ చేశారు. మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేందుకు ఇద్దరు అధికారులతో ద్విసభ్య కమిటీ వేశారు. గ్రేటర్ అదనపు కమిషనర్ రామకృష్ణా రావు, నార్త్జోన్ ఎస్ఈ కిషన్లను కమిటీ సభ్యులుగా నియమించారు.
సర్కిల్, జోనల్ కార్యాలయాల నుంచే తప్పుడు సమాచారం వచ్చిందా? కేంద్ర కార్యాలయంలోని ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ విభాగంలోనే పొరపాటు జరిగిందా? అన్న విషయాన్ని ఈ కమిటీ తేల్చనుంది. ఇప్పటి వరకు పూర్తయినట్టు చూపిన రోడ్లలో క్షేత్రస్థాయిలో ఎన్ని పనులు జరిగాయి? ఎంత బిల్లులు మంజూరయ్యాయి? తదితర వివరాలను పరిశీలించనుంది.