GHMC election results : నేడే జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు... కౌంటింగ్కి అన్ని ఏర్పాట్లు పూర్తి...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాలు నేడు(డిసెంబర్ 4) వెలువడనున్నాయి. టీఆర్ఎస్-బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఈ ఎన్నికల సమరంలో అంతిమ విజేత ఎవరన్నది నేటితో తేలిపోనుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ అధికార టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టిన నేపథ్యంలో... ఎన్నికల ఫలితాలు కూడా అలాగే ఉండబోతున్నాయా... లేక అంచనాలు తలకిందులవబోతున్నాయా అన్న ఉత్కంఠ నెలకొంది.
Recommended Video
గ్రేటర్ పరిధిలోని మొత్తం 150 డివిజన్ల ఓట్ల లెక్కింపు కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రేటర్ వ్యాప్తంగా 30 సర్కిల్స్ ఉండగా, సర్కిళ్ల వారీగానే ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల అధికారులు మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 14, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 10, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 6 కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రతీ సర్కిల్ పరిధిలోని వార్డులను బట్టి 150 హాల్స్, ఒక్కో హాల్కి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు.ప్రతీ టేబుల్ వద్ద ఇద్దరు అసిస్టెంట్లు,ఒక కౌంటింగ్ సూపర్ వైజర్ ఉండనున్నారు.
ఒక రౌండ్కి 14వేల ఓట్లను లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపులో మొత్తం 8,152 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. కౌంటింగ్ ప్రక్రియను రికార్డు చేసేందుకు సీసీటీవీ కెమెరాలు,వీడియోగ్రఫీ కూడా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాళ్లలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడంపై నిషేధం విధించారు. పార్టీల ఏజెంట్లు రిటర్నింగ్ అధికారుల వద్ద పాసులు తీసుకోవాల్సి ఉంటుంది. పాసులు లేనివారికి అనుమతి లేదని ఈసీ వెల్లడించింది.
అనుమానిత ఓట్లకు సంబంధించి రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని ఈసీ తెలిపింది. కౌంటింగ్ పట్ల అనుమానాలు ఉంటే... ఫలితాల వెల్లడికి ముందే రీకౌంటింగ్ కోసం రిటర్నింగ్ అధికారికి విజ్ఞప్తి చేయాలని సూచించింది. అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే లాటరీ పద్ధతిలో డ్రా తీస్తామని, దానికి అనుగుణంగా తుది ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటును చేశారు. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమవనుండగా... మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు.
కాగా,డిసెంబర్ 1న గ్రేటర్ పరిధిలోని 149 డివిజన్లకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఓల్డ్ మలక్పేట డివిజన్కు గురువారం(డిసెంబర్ 3) రీపోలింగ్ నిర్వహించారు. ఈసారి ఎన్నికల్లో మొత్తం 34,50,331(46.55శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.గత గ్రేటర్ ఎన్నికలతో పోల్చితే ఈసారి ఓటింగ్ శాతం కాస్త పెరగడంతో... పెరిగిన ఓటింగ్ ఎవరికి అనుకూలంగా మారనుందన్న ఉత్కంఠ నెలకొంది.