వైఎస్సార్ మరణంపై రఘునందన్ వివాదాస్పద వ్యాఖ్యలు: వైసీపీ ఓట్లను దూరం చేస్తాయా?: దిద్దుబాటు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విమర్శల పదును పెరిగింది. ఆరోపణలు, ప్రత్యారోపణల తీవ్రత పతాక స్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును దేశద్రోహిగా, ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ ఘాటు ఆరోపణలను సంధించింది భారతీయ జనతా పార్టీ. మరోసారి అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలనే చేసింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో చిక్కుల్లో పడింది. దిద్దుబాటు చర్యలకు దిగాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది.
GHMC elections 2020: మజ్లిస్పై బీజేపీ త్రిపుల్ తలాక్ బ్రహ్మాస్త్రం: ఓటుబ్యాంకు కొల్లగొట్టేలా
వైఎస్సార్ మరణంపై రఘునందన్ వివాదాస్పదం
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురై మరణించిన ఉదంతంపై బీజేపీకి చెందిన దుబ్బాక శాసనసభ్యుడు మాధవనేని రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు వివాదాలకు కేంద్రబిందువు అయ్యాయి. తాను సైన్స్ టీచర్నని.. ప్రకృతిని నమ్ముతానని ఆయన అన్నారు. ప్రకృతిలో చర్యకు ప్రతిచర్య ఉంటుందని, వెనకటికొకాయన పావురాల గుట్టలో పోయాడని, కేసీఆర్ కూడా అలాగే పోతారని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి.
వైసీపీ ఓట్లకు చిల్లు..
వైఎస్సార్ మరణంపై రఘునందన్ రావు చేసిన ఈ వ్యాఖ్యలతో వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపోటములను ఈ కామెంట్స్ ప్రభావితం చేయొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కేంద్రంలో బీజేపీతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్లో నివసిస్తోన్న వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు ఆ పార్టీకి అనుకూలంగా ఓటు వేయొచ్చనే అంచనాలను తలకిందులు చేసినట్టయిందని అంటున్నారు.
సోషల్ మీడియాలో బీజేపీకి వ్యతిరేకంగా..
రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రకంపనలను సృష్టించాయి. వైసీపీ సానుభూతిపరులు ఈ వ్యాఖ్యలను ఎంత తీవ్రంగా తీసుకున్నారనడానికి అద్దం పట్టాయి. బీజేపీకి అనుకూలంగా ఓటు వేయాలనుకున్న తమ నిర్ణయాన్ని రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు మార్చేశాయంటూ పోస్టులు పెడుతున్నారు. వైసీపీని అభిమానించే జీహెచ్ఎంసీ పరిధిలోని ఓటర్లు.. ఏ పార్టీకి ఓటు వేయాలనే విషయాన్నిన బీజేపీ ఎమ్మెల్యే చెప్పకనే చెప్పినట్టయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. రఘునందన్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
Recommended Video
డ్యామేజ్ కంట్రోల్ కోసం..
రఘునందన్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు సృష్టించిన వివాదాన్ని బీజేపీ చల్లార్చే పనిలో పడినట్టు కనిపిస్తోంది. బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఓ ఛానల్లో నిర్వహించిన డిబేట్ సందర్భంగా క్షమాపణలు చెప్పడం.. కమలనాథులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించారనడానికి నిదర్శనంగా భావిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్ల గానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల గానీ తెలంగాణ బీజేపీలో గౌరవభావం ఉందని అన్నారు. రఘునందన్ రావు ఉద్దేశపూరకంగా ఈ వ్యాఖ్యలు చేసి ఉండరని తాను భావిస్తున్నానని చెప్పుకొచ్చారు.