GHMC elections 2020: సాధినేని యామిని ఎంట్రీ: భాగ్యనగరం నుంచి వారిని ఏరిపారేస్తాం
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. స్టార్ క్యాంపెయినర్లను దింపుతోంది. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ఎంట్రీతో ప్రారంభమైన స్టార్ క్యాంపెయినర్ల రాక.. మరింత ఊపందుకోనుంది. కేంద్రమంత్రులు హైదరాబాద్కు రానున్నారు. ఏపీకి చెందిన వారు లక్షలాది మంది హైదరాబాద్లో స్థిరపడిన నేపథ్యంలో.. అక్కడి నుంచీ పెద్ద ఎత్తున పార్టీ నేతలను ప్రచారానికి పిలిపిస్తోంది. తాజాగా బీజేపీ మహిళా నేత సాధినేని యామిని శర్మ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించారు.
కబ్జాల హైదరాబాద్..
ఇంట్లో నుంచే ఆమె ఓ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి అగ్ర నేతలపై ఘాటు విమర్శలను సంధించారు. మజ్లిస్ నేతలపైనా మండిపడ్డారు. హైదరాబాద్ను కబ్జాల రాజధానిగా మార్చేశారని, ఫలితంగా- మొన్నటి ఓ మోస్తరు వర్షాలకు భాగ్యనగరం సముద్రాన్ని తలపించిందంటూ ఎద్దేవా చేశారు. భౌగోళికంగా ఎత్తయిన ప్రదేశంలో ఉన్న హైదరాబాద్.. చిన్నపాటి వర్షానికి కూడా మునిగిపోవడానికి టీఆర్ఎస్ నేతలు చెరువులను కబ్జాలపాలు చేయడమే ప్రధాన కారణమని ఆరోపించారు.
కుటుంబ పాలనలో అష్టకష్టాలు..
టీఆర్ఎస్ కుటుంబ పాలనలో తెలంగాణ అష్టకష్టాలు పడుతోందని యామిని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం..తెలంగాణను టీఆర్ఎస్ పార్టీగా భావిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో ఉన్నందున.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్నే గెలిపించాలని, అప్పుడే నిధులకు కొరత ఉండబోదంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పు పట్టారు. అదే ఫార్ములాను బీజేపీ కూడా సార్వత్రిక ఎన్నికల్లో ప్రయోగిస్తే.. ఎలా ఉంటుందని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున.. తాము అధికారంలో లేని తెలంగాణకు ఎందుకు నిధులివ్వాలని పార్టీ అగ్రనేతలు నిర్ణయిస్తే. ఏం చేస్తారని నిలదీశారు.
రోహింగ్యాలను ఏరిపారేస్తాం..
రోహింగ్యాలను ఏరిపారేసే శక్తిసామర్థ్యాలు బీజేపీకి మాత్రమే ఉన్నాయని సాధినేని యామిని అన్నారు. దేశ విచ్చిన్న శక్తులు హైదరాబాద్లో తలదాచుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వారికి ఆధార్ కార్డులు, గుర్తింపుకార్డులను ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. రోహింగ్యాలు టీవీ ఛానల్ను నెలకొల్పే స్థాయికి ఎదిగారని విమర్శించారు. అనధికారికంగా ఉంటున్న రోహ్యింగాలు, పాకిస్తానీలను టీఆర్ఎస్, మజ్లిస్లు పెంచి పోషిస్తున్నాయని మండిపడ్డారు. వారిని తరిమి కొట్టేది బీజేపీ ఒక్కటేనని, తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఙప్తి చేశారు.
Recommended Video
కుటుంబ పాలనకు బీజేపీ దూరం..
కుటుంబ పాలనను ఏ మాత్రం ప్రోత్సహించని పార్టీ బీజేపీ ఒక్కటేనని యామిని అన్నారు. ఓ దళితుడిని తమ పార్టీ రాష్ట్రపతి స్థానంలో కూర్చోబెట్టిందని, ఓ బీసీ నేత ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారని చెప్పారు. అన్ని వర్గాల వారికీ అన్ని విధాలుగా రాజకీయ అవకాశాలను కల్పించేది బీజేపీ మాత్రమేనని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత తొలి ముఖ్యమంత్రిగా దళితుడికి అవకాశం ఇస్తామని నమ్మించిన కేసీఆర్.. ఆ వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. హైదరాబాద్లో బీజేపీ అధికారంలోకి రాబోతోందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.