బీజేవైఎం అధినేత తేజస్వి సూర్యకు షాకిచ్చిన హైదరాబాద్ పోలీసులు: క్రిమినల్ ట్రెస్పాస్
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు దక్షిణం లోక్సభ సభ్యుడు తేజస్వి సూర్యకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. క్రిమినల్ ట్రెస్పాస్ కింద కేసు నమోదు చేశారు. ఇటీవలే ఆయన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం వివిధ డివిజన్లలో పర్యటించారు. రోడ్ షోలను నిర్వహించారు. హైదరాబాద్ లోక్సభ సభ్యుడు, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై ఘాటు విమర్శలను గుప్పించారు.
వాటి మాటెలా ఉన్నప్పటికీ- ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలోకి ప్రవేశించడం పట్ల తేజస్వి సూర్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 447, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఉస్మానియా యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్లోకి ప్రవేశించడానికి తేజస్వి పోలీసుల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతిని తీసుకోలేదు.
అలాగే- విశ్వవిద్యాలయం అధికార యంత్రాంగం నుంచీ అనుమతులు తీసుకునే ప్రయత్నం చేయలేదు. దీనితో ఆయనపై ఓయూ రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. అక్రమంగా క్యాంపస్లోకి ప్రవేశించారని లిఖితపూరక ఫిర్యాదు ఇచ్చారు. దీనితో పోలీసులు తేజస్విపై క్రిమినల్ ట్రెస్ పాసింగ్ కింద కేసు నమోదు పెట్టారు. త్వరలోనే ఆయనకు నోటీసులను పంపిస్తారని తెలుస్తోంది. ప్రభుత్వ పరిధిలోని కట్టడంలోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా.. ఎన్నికల ప్రచారాన్ని చేపట్టినందున ఆయనపై కేసు పెట్టారని అంటున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 24వ తేదీన తేజస్వి సూర్య ఉస్మానియా క్యాంపస్లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. బీజేపీ కార్యకర్తలతో కలిసి ఆయన కంచెలను తొలగించి మరీ క్యాంపస్లో అడుగు పెట్టారు. కాలి నడకన వెళ్తోన్న ఆయనను ఎన్సీసీ గేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో అప్పట్లో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వ్యవహారం మొత్తం వివాదానికి దారి తీసింది. ఓయూ రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు ఆయనపై తాజా కేసు పెట్టారు.