బీజేపీకి జై: గ్రేటర్ బరి నుంచి తప్పుకొన్న జనసేన: నామినేషన్లూ వెనక్కి: చక్రం తిప్పిన కిషన్ రెడ్డి
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరి నుంచి జనసేన పార్టీ తప్పుకొంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. ఇప్పటికే నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన అభ్యర్థులు కూడా పోటీ నుంచి వైదొలగాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశించారు. దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇందులో భాగంగానే- తాము రేసు నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపారు.
Recommended Video
GHMC elections 2020: కేసీఆర్కు ఉగ్రవాదులతో లింక్: బండి సంజయ్కు కేటీఆర్ కౌంటర్
రెండు పార్టీల మధ్య సమన్వయ లోపం..
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామంటూ జనసేన పార్టీ వెల్లడించిన 24 గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్.. ఇతర నాయకులు సీట్ల సర్దుబాటుపై చర్చించడానికి తమ పార్టీ కార్యాలయానికి రానున్నట్లు ట్విట్టర్ వేదికగా జనసేన పార్టీ వెల్లడించింది. ఆ తరువాత కొద్దిసేపటికే అదే బండి సంజయ్.. ఈ వార్తలను కొట్టేశారు. తాము ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోవట్లేదనే విషయాన్ని ఇదివరకే ప్రకటించామని, జనసేనతో కలిసి పనిచేయట్లేదని కుండబద్దలు కొట్టారు.
గందరగోళానికి దారి తీసిన పరిణామాలు..
పొత్తు ఉంటుందంటూ అటు జనసేన తన అధికారిక ట్విట్టర్లో ప్రకటించడం.. ఆ వెంటనే బండి సంజయ్ దాన్ని తోసిపుచ్చడం వంటి పరిణామాల వల్ల గందరగోళం నెలకొంది. మరోవంక- జనసేన పార్టీ అభ్యర్థులు యధాలాపంగా నామినేషన్లను దాఖలు చేసుకుంటూ వెళ్లడం మరింత సమన్వయలోపానికి దారి తీసినట్టు కనిపించింది. పొత్తు ఉందా? లేదా? ఉమ్మడిగా పోటీ చేస్తున్నారా? లేదా ఒంటరిగా పోరాడుతున్నారా? అనే గందరగోళం క్షేత్రస్థాయిలో బీజేపీ, జనసేన పార్టీ క్యాడర్లో నెలకొంది.
జోక్యం చేసుకున్న బీజేపీ టాప్ లీడర్లు..
మరో 10 రోజుల్లో పోలింగ్ నిర్వహించాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తరహా గందరగోళం నెలకొనడం మంచిది కాదని బీజేపీ నేతలు భావించారు. వెంటనే- పవన్ కల్యాణ్తో భేటీ అయ్యారు. సికింద్రాబాద్ లోక్సభ సభ్యుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి, బీజేపీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్..జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ నివాసంలో పవన్ కల్యాణ్తో సమావేశం అయ్యారు. సుమారు రెండుగంటల పాటు సుదీర్ఘంగా వారి మధ్య ఈ భేటీ కొనసాగింది. ఎన్నికల బరి నుంచి జనసేన పార్టీ తప్పుకొనేలా పవన్ కల్యాణ్ను ఒప్పించారు.
పవన్ తప్పుకొనేలా..
అనంతరం ఏకాభిప్రాయానికి వచ్చారు. ఉమ్మడి ప్రకటన చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తాము పోటీ చేయట్లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తమ పార్టీ క్యాడర్ మొత్తం బీజేపీ అభ్యర్థులకు సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని సూచించారు. అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చినందున పార్టీ క్యాడర్ నిరాశకు గురి కావొద్దని విజ్ఙప్తి చేశారు. బీజేపీతో పొత్తు ఉన్నందు వల్ల, ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా తాము ఎన్నికల బరి నుంచి తప్పుకొంటున్నామని స్పష్టం చేశారు. జనసైనికులు నిరాశపడొద్దని, బీజేపీకి సంపూర్ణంగా సహకరించాలని పవన్ కల్యాణ్ సూచించారు.
బలమైన నాయకత్వం అవసరం..
రెండు తెలుగు రాష్ట్రాల్లో తాము బీజేపీతో కలిసి పనిచేస్తున్నామని, ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోందని, ఈ పరిస్థితుల్లో బలమైన నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆ నాయకత్వ బాధ్యతలను బీజేపీకి అప్పగించామని అన్నారు. ఒక్క ఓటు కూడా మరో పార్టీకి పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత జన సైనికులపై ఉందని అన్నారు. గ్రేటర్తో పాటు భవిష్యత్తు ఎన్నికల్లోనూ కలిసే పనిచేస్తామని తేల్చి చెప్పారు.