వాడెవడో కూల్చేస్తామంటే.. మీరేం చేస్తున్నారు: ఎన్టీఆర్కు భారతరత్న మేం ఇప్పిస్తాం: టీబీజేపీ
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మరో సరికొత్త వివాదం చెలరేగింది. ఎన్నికల ప్రచారం భాగంగా ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలు ప్రవాహంలా తన్నుకొస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. వాటికి అడ్డుకట్ట పడేలా కనిపించట్లేదు. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ వాటి తీవ్రత మరింత అధికమౌతోంది.
హుస్సేన్ సాగర్ను ఆక్రమించి మరీ నిర్మించిన దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుల సమాధులను కూల్చేస్తామంటూ మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన తాజా వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపాయి. బీజేపీ నేతలకు అయాచిత అస్త్రాన్ని అందించినట్టయింది.
పీవీ, ఎన్టీఆర్ ఘాట్లకు నివాళి నివాళి..
అక్బరుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే భారతీయ జనతా పార్టీ కౌంటర్ అటాక్ చేపట్టింది. నెక్లెస్ రోడ్డులో ఉన్న పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్ను బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ సందర్శించారు. నివాళి అర్పించారు. ఓ పార్టీకి గానీ, ఓ ప్రాంతానికి గానీ, ఓ మతానికి గానీ పరిమితం కాని మహా నేతగా పీవీ నరసింహారావును కీర్తించారాయన. అలాంటి జాతీయ నాయకుడి సమాధిని కూల్చేస్తామంటూ మజ్లిస్ నేతలు హెచ్చరించడం మూర్ఖత్వానికి పరాకాష్ట అని విమర్శించారు. ఈ వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
మీరేం చేస్తున్నారు?
పీవీ ఘాట్ను తొలగిస్తామని అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యానాల పట్ల అధికార టీఆర్ఎస్ నాయకులు ఎందుకు స్పందించట్లేదని బండి సంజయ్ విమర్శించారు. టీఆర్ఎస్-మజ్లిస్ దోస్తీకి ఇది నిదర్శనమని ఆరోపించారు. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్టీలకు అతీతంగా తమకు మద్దతు ప్రకటించాలని విజ్ఙప్తి చేశారు. కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఖండించాలని సూచించారు.
అక్బరుద్దీన్పై క్రిమినల్ కేసు
మాజీ ప్రధాని, ముఖ్యమంత్రులను అవమానించేలా వ్యాఖ్యానాలు చేసిన అక్బరుద్దీన్పై క్రిమినేల్ కేసు నమోదు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో పోలీసులు తమ విధులను తాము నిర్వర్తించాలని సూచించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి నుంచి వందలాది మంది అక్రమంగా వలస వచ్చి, పాతబస్తీలో నివసిస్తున్నారని, అలాంటి వారిని ఏరిపారేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రోహింగ్యాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆశ్రయం ఇస్తోందని మండిపడ్డారు. పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నారా? లేదా? అనే విషయంపై హైదరాబాద్ నగర పోలీసులు నివేదిక రూపొందించాలని డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్కు భారతరత్న
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు తాము భారతరత్న ఇప్పిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ ఘాట్ను సందర్శించిన నివాళి అర్పించారు. ఏపీ బీజేపీ నేతలతో మాట్లాడి.. దీనికి సంబంధించిన ఓ తీర్మానాన్ని కేంద్రానికి పంపిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ ఘాట్ను కూల్చేస్తామంటే ఏ ఒక్క టీడీపీ నేత కూడా ఇంతవరకు ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్ను మజ్లిస్ నేతలు అవమానిస్తే.. పార్టీలకు అతీతంగా తాము స్పందిస్తున్నామని, ఆ పని టీడీపీ నేతలు ఎందుకు చేయట్లేదని నిలదీశారు. మైనారిటీ ఓటుబ్యాంకును పోగొట్టుకుంటామనే భయం టీడీపీ నేతల్లో వ్యక్తమౌతోందని ఆరోపించారు.