గ్రేటర్ ఎన్నికలు : విమర్శలకు చెక్... తుది ఓటింగ్ శాతమెంతో తెలుసా...?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తుది ఓటింగ్ శాతాన్ని ఎన్నికల కమిషన్ బుధవారం(డిసెంబర్ 2) ప్రకటించింది. ఈసారి ఎన్నికల్లో 46.68 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించింది.అత్యధికంగా కంచన్బాగ్లో 70.39 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా యూసుఫ్ గూడలో 32.99శాతం పోలింగ్ నమోదైంది. గత 20 ఏళ్లలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే అత్యధిక పోలింగ్ కావడం విశేషం.
రేపు ఓల్డ్ మలక్పేట్ రీపోలింగ్
డిసెంబర్ 1న గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లకు గాను 149 డివిజన్లకు పోలింగ్ జరిగింది. ఓల్డ్ మలక్పేట డివిజన్లో అభ్యర్థుల పార్టీ గుర్తులు తారుమారవడంతో అక్కడ పోలింగ్ నిలిపివేశారు. బ్యాలెట్ పత్రంలో సీపీఐ అభ్యర్థి పేరు ఎదురుగా సీపీఎం గుర్తు ముద్రించడంతో పోలింగ్ నిలిపివేయాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. దీంతో ఎన్నికల కమిషన్ ఓల్డ్ మలక్పేటలోని 69 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ను నిలిపివేసింది. డిసెంబర్ 3న అక్కడ రీపోలింగ్ నిర్వహించనున్నారు. తాజాగా ఈసీ ప్రకటించిన ఓటింగ్ గణాంకాలకు ఓల్డ్ మలక్పేట పోలింగ్ను కూడా చేరిస్తే... గ్రేటర్లో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
గతం కంటే 1.39శాతం పెరుగుదల
2009 గ్రేటర్ ఎన్నికల్లో 42.04 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2016 ఎన్నికల్లో 45.29 శాతం పోలింగ్ నమోదైంది. అంటే,గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 1.39శాతం ఓటింగ్ పెరిగింది. ఓల్డ్ మలక్పేట రీపోలింగ్ తర్వాత ఇది మరింత పెరగవచ్చు. నిజానికి నిన్నటి(డిసెంబర్ 1) ఓటింగ్ సరళిని చూశాక.. చాలామంది గ్రేటర్ ఓటర్లపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ ఓటర్లు మహా బద్దకిస్టులని... చైతన్యం లేనివారని... రకరకాలుగా విమర్శలు గుప్పించారు. నిజమే... గ్రామీణ,సెమీ అర్బన్ ఓటర్లతో పోల్చితే ఈ మాట నిజమే అయినప్పటికీ... గతం కంటే ఓటింగ్ అనూహ్యంగా పుంజుకోవడం విశేషమనే చెప్పాలి.
Recommended Video
సత్తా చాటెదెవరు?
గ్రేటర్లో గతంతో పోలిస్తే ఎక్కువ ఓటింగ్ నమోదవడంతో ఎన్నికల్లో విజయం ఎవరిని వరించనుందన్న చర్చ జరుగుతోంది. మేయర్ పీఠం తమదేనని,సెంచరీ కొడుతామని టీఆర్ఎస్ ధీమాగా చెప్తుండగా... ప్రజలు తమకే పట్టం కట్టారని బీజేపీ చెబుతోంది. ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్,బీజేపీల దూకుడు ముందు కాంగ్రెస్ చర్చల్లో కూడా లేకుండా పోయింది. గ్రేటర్లో ఒకవేళ బీజేపీ సత్తా చాటితే.. టీఆర్ఎస్ పతనం మొదలైనట్లేనన్న చర్చ సహజంగానే తెర పైకి వస్తుంది. టీఆర్ఎస్ సత్తా చాటితే మాత్రం బీజేపీ దూకుడుకు బ్రేక్ వేసినట్లవుతుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 4న వెల్లడయ్యే ఫలితాల కోసం రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.ఓల్డ్ మలక్పేటలో రీపోలింగ్ దృష్ట్యా ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఈసీ నిషేధం విధించింది.