గ్రేటర్ షాక్: టిక్కెట్ రాలేదని కిషోర్ ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ వద్ద కిషోర్ గౌడ్ గురువారం నాడు ఆత్మహత్యాయత్నం చేశాడు. తనకు కాంగ్రెస్ పార్టీ నుంచి టిక్కెట్ రాలేదనే ఆవేదన, మనస్తాపంతో అతను గాంధీ భవన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు అతడిని అడ్డుకున్నారు.
కిషోర్ గౌడ్ తన వెంట పెట్రోల్ తీసుకొని గాంధీ భవన్లోకి వచ్చారు. తనకు పార్టీ బీఫాం ఇవ్వలేదని చెబుతూ అతను ఒంటి పైన పెట్రోల్ పోసుకున్నాడు. నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు, ఇతరులు అడ్డుకున్నారు. అతని పైన నీళ్లు పోశారు.
మరో డివిజన్ విషయమై తొలుత కమలానాయక్కు టిక్కెట్ ఇచ్చారు. ఆ తర్వాత చివరి నిమిషంలో రుక్మిణి అనే మహిళకు టిక్కెట్ కేటాయించారు. దీంతో కమలానాయక్ తన అనుచరులతో కలిసి వచ్చి గాంధీ భవన్ ఎదుట ఆందోళనకు దిగారు. కాగా, నామినేషన్ల ఉపసంహరణ గడువు మూడు గంటలతో ముగిసింది.
100కు పైగా సీట్లు గెలుస్తాం: మహేందర్ రెడ్డి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలు నిర్వహిస్తామని మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు. గ్రేటర్లోని 150 డివిజన్లలో 100కు పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పేదల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టారు.
పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించి ఇస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఇతర పార్టీల నేతలు తమ పార్టీలో చేరుతున్నారు. టీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మహేందర్ రెడ్డి అన్నారు.