నేరెడ్మెట్లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు... మరికొద్ది గంటల్లో తేలనున్న ఫలితం...
ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్లో నేరెడ్మెట్ డివిజన్లో ఓట్ల లెక్కింపును నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం(డిసెంబర్ 9) ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సైనిక్పురిలోని భవన్స్ వివేకానంద కాలేజీలో లెక్కింపు కొనసాగుతోంది. బ్యాలెట్ పేపర్పై స్వస్తిక్ ముద్రకు బదులు ఇతర ముద్రలు ఉన్న 544 ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఫలితాన్ని ప్రకటించనున్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేసిన సంగతి తెలిసిందే. స్వస్తిక్ ముద్రకు బదులు ఇతర ముద్రలు ఉన్న ఓట్లను కూడా లెక్కించాలని కౌంటింగ్ ముందు రోజు అర్ధరాత్రి ఈసీ సర్క్యులర్ జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని బీజేపీ హైకోర్టులో సవాల్ చేయడంతో... ఇతర ముద్రలు ఉన్న ఓట్లు ఫలితాన్ని నిర్ణయించే పక్షంలో అక్కడ ఓటింగ్ నిలిపివేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నేరెడ్మెట్ డివిజన్లో ఇతర ముద్రలు ఉన్న 544 ఓట్లను కౌంట్ చేయలేదు.
రెండు రోజుల క్రితం హైకోర్టు ఈ ఓట్లను లెక్కించేందుకు అనుమతినివ్వడంతో నేరెడ్మెట్ డివిజన్ ఫలితం వెల్లడికి అడ్డంకులు తొలగిపోయాయి. 2005 రూల్ 51 ప్రకారం బ్యాలెట్ పేపర్పై ఉపయోగించే ముద్రలకు సంబంధించి రిటర్నింగ్ అధికారికి తుది నిర్ణయం తీసుకునే అధికారం ఉందని ఎన్నికల కమిషన్ తెలుపగా న్యాయస్థానం ఆ వాదనతో ఏకీభవించింది. మరికొద్ది గంటల్లో నేరెడ్మెట్ ఫలితం వెల్లడికానుండటంతో ఈ డివిజన్ను ఏ పార్టీ గెలుచుకోబోతుందన్న ఆసక్తి నెలకొంది.
Recommended Video
కాగా,ఈసారి ఈసారి గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడింది. ఓటర్లు ఏ పార్టీకి మెజార్టీ కట్టబెట్టలేదు. మొత్తం 150 డివిజన్లకు గాను టీఆర్ఎస్ 55 డివిజన్లలో గెలుపొందగా, బీజేపీ 48 డివిజన్లను కైవసం చేసుకుంది. ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ రెండు స్థానాలతో సరిపెట్టుకుంది. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ఎవరికీ దక్కకపోవడంతో మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.