GHMC Exit polls : ఎగ్జిట్ పోల్స్ తలకిందులవుతాయా.. కారుకు రివర్స్ గేర్ తప్పదంటున్న బీజేపీ..
జీహెచ్ఎంసీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. దాదాపుగా అన్ని సర్వే సంస్థలు 'కారు'దే టాప్ గేర్ అని అంచనా వేశాయి. తక్కువలో తక్కువ టీఆర్ఎస్కు 68-78 స్థానాలు వస్తాయని... అత్యధికంగా 101 స్థానాల వరకు రావొచ్చునని లెక్కలు వేశాయి. ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలతో చెలరేగిన బీజేపీ ఫలితాల్లో మాత్రం చతికిలపడుతున్నట్లు దాదాపుగా అన్ని సర్వే సంస్థలు అంచనా వేశాయి. తక్కువలో తక్కువ ఆ పార్టీకి 5-12 స్థానాలు,అత్యధికంగా 35 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపాయి.
అంచనాలు తలకిందులవుతాయి : ఎమ్మెల్సీ రామచంద్రరావు
నాగన్న సర్వే,సీపీఎస్ టీమ్,పీపుల్ పల్స్,ఆరా,ఎన్ఎఫ్ఓ ఇలా తదితర సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్ అంచనాలు తలకిందులవుతాయని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలోనూ రిపబ్లిక్ టీవీ సహా అన్ని సంస్థలు బీజేపీ ఓడిపోతుందని చెప్పాయని... కానీ ఫలితాలు తమకే అనుకూలంగా వచ్చాయని గుర్తుచేశారు. అదే తరహాలో జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు కూడా ఎగ్జిట్ పోల్స్కు విరుద్దంగా వస్తాయని... సర్వే సంస్థలు టీఆర్ఎస్కు వస్తాయని చెబుతున్న స్థానాలు బీజేపీకి వస్తాయన్నారు. టీఆర్ఎస్ ఎక్స్అఫీషియో ఓట్లను కూడా బీజేపీ అధిగమించి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
సెంచరీ కొడుతామన్న ఎమ్మెల్యే క్రాంతి కిరణ్..
గతంలో దుబ్బాక ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్ను నమ్మిన బీజేపీ... ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ను మాత్రం ఎందుకు నమ్మదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ప్రశ్నించారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు స్పందిస్తూ... దుబ్బాకలో కేవలం పీపుల్స్ సర్వే మాత్రమే బీజేపీ గెలుపును అంచనా వేసిందన్నారు. తాజా ఎగ్జిట్ పోల్స్లో పీపుల్స్ సర్వే బీజేపీకి 25-35 స్థానాలు వస్తాయని అంచనా వేయడం గమనార్హం. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ టీఆర్ఎస్ సెంచరీ మార్క్ను దాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఆరేళ్లలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ది పనులకు ప్రజామోదం ఉంటుందని... అది ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తుందని అన్నారు.
హెచ్ఎంఆర్,పల్స్ టుడే ఎగ్జిట్ పోల్స్...
ఇప్పటివరకూ నాగన్న సర్వే,ఆరా,పీపుల్స్ సర్వే,ఆత్మసాక్షి సర్వే తదితర ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడవగా.. తాజాగా మరో రెండు సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. ఇందులో
హెచ్ఎంఆర్ అనే సంస్థ సర్వే ప్రకారం టీఆర్ఎస్ 65-70 ,బీజేపీ 27-31,కాంగ్రెస్ 03-06,ఎంఐఎం 35-40 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది. మరో సంస్థ పల్స్ టుడే సర్వే ప్రకారం...టీఆర్ఎస్ 86-90, బీజేపీ 34-38, ఎంఐఎం18-20,కాంగ్రెస్ 1-2 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది. నాగన్న సర్వే టీఆర్ఎస్కు 95-100 సీట్లు వస్తాయని అంచనా వేసింది. నాగన్న సర్వే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ 95-101సీట్లు, బీజేపీకి 5-12 సీట్లు, ఎంఐఎంకు 35 -38 సీట్లు, కాంగ్రెస్కు 0-1 సీటు దక్కే అవకాశం ఉంది. మరో ప్రముఖ సర్వే ‘ఆరా' అంచనాల ప్రకారం టీఆర్ఎస్ 78(ప్లస్ ఆర్ మైనస్ 7) సీట్లు, బీజేపీ 28(ప్లస్ ఆర్ మైనర్ 5), ఎంఐఎం 41(ప్లస్ ఆర్ మైనర్ 5), కాంగ్రెస్ 3(ప్లస్ ఆర్ మైనస్ 3) సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది.
కేటీఆర్ సక్సెస్.. బీజేపీ ఫెయిల్..?
బీజేపీ జాతీయ నాయకుల ప్రచారం ఆ పార్టీకి కలిసిరాలేదని సర్వే సంస్థల నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. ఉద్రిక్తతను రేకెత్తించే వ్యాఖ్యలు ఆ పార్టీకి మైనస్ అయినట్లు చెప్తున్నారు.మంత్రి,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకున్నాయని... విషయాన్ని సూటిగా చెప్పడంలో ఆయన సఫలమయ్యారని అంటున్నారు. మొత్తం మీద హైదరాబాద్ ఓటర్లు మత రాజకీయాల కంటే అభివృద్ది వైపే మొగ్గుచూపారని సర్వే సంస్థల నిర్వాహకులు చెప్తున్నారు. అయితే రేపటి(డిసెంబర్ 4) ఫలితాల్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతాయా లేక బీజేపీ చెప్తున్నట్లు తలకిందులవుతాయా అన్నది వేచి చూడాలి.