పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసిన తెరాస: వ్యూహం ఏమిటి?
హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రచారం చేస్తారా, లేదా అనేది తేలకుండానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో తమ తరఫున పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ను కోరాలని టిడిపి, బిజెపి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో టిఆర్ఎస్ నేతలు పవన్ కళ్యాణ్పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
ఇంతకు ముందు తెలంగాణ ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి పవన్ కళ్యాణ్పై తీవ్ర వ్యాఖ్యలు చేయగా, తాజాగా శనివారంనాడు తెరాస పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత దాడికి దిగారు. జనసేన అధినేత, సినీ హీరో పవన్కల్యాణ్ది పవనిజం కాదని, అది బ్రోకరిజమని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, హైదరాబాదులోని జాంబాగ్ డివిజన్ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఎన్నికల ఇన్చార్జి పిడమర్తి రవి అన్నారు.
టీడీపీ, బీజేపీ నాయకులు పవన్ కల్యాణ్ను రంగంలోకి దింపుతారని ప్రచారం జరుగుతోందని, ఆయన పవనిజం తెలంగాణలో పని చేయదని హెచ్చరించారు. జాంబాగ్ డివిజన్లోని న్యూ ఉస్మాన్గంజ్ రక్తమైసమ్మ దేవాలయం వద్ద బుధవారం టీఆర్ఎస్ నాయకుల ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడారు. తెలంగాణ ప్రజలు సినిమాలు చూస్తేనే సినీ నటుడు పవన్కల్యాన్ ఎదుగుతున్నారని ఆయన చెప్పారు.
జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్పై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలప్పుడే గంగిరెద్దుల్లా కొంత మంది వస్తారని ఆమె వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో టిడిపి, బిజెపి పవన్ కళ్యాణ్ను ప్రచారంలోకి దించుతాయట అంటూ ఆమె పలు వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలప్పుడు మేకప్, ఆ తర్వాత పేకప్ అంటూ కవిత వ్యాఖ్యానించారు. తిక్క పవన్ కళ్యాణ్కు కెసిఆర్ ఎప్పుడో చుక్కలు చూపించారని ఆమె శనివారంనాడు వ్యాఖ్యానించారు. ఆంధ్రోళ్లు ఎక్కువగా ఉన్నారని ఆంధ్రోళ్లతో హైదరాబాదులో ప్రచారం చేయిస్తారట అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారానికి దిగితే తమ విమర్శల స్థాయి మరింత పదునుగా ఉంటుందని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారా అనేది తెలియడం లేదు. మేకప్ వేసుకుని వచ్చేవారిని ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరని ఆమె అన్నారు.
టిడిపి, బిజెపి తరఫున ప్రచారం చేయడానికి పవన్ కళ్యాణ్ రావాలనుకుంటే పవన్ కళ్యాణ్ను పునరాలోచనలో పడాలనే ముందస్తు వ్యూహంతో తెరాస నాయకులు అలా వ్యాఖ్యలు చేస్తున్నారా, తమ వ్యాఖ్యల ద్వారా ఎన్నికల వేడిని రాజేయాలని చూస్తున్నారా అనేది స్పష్టంగా తేలడం లేదు. అయితే, పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడం ద్వారా మాత్రం ప్రధానంగా వారు వార్తలకెక్కుతున్నారు. ఈ స్థితిలో పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తారా, లేదా అనేది వేచి చూడాల్సిందే.