3గంటల నుంచే ఓట్ల లెక్కింపు, 5గంటల తర్వాతే తొలి ఫలితం: జిహెచ్ఎంసి కమిషనర్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను శుక్రవారం(ఫిబ్రవరి5) సాయంత్రం 5గంటల తర్వాతే వెల్లడిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు విషయమై మీడియాతో మాట్లాడుతూ.. శుక్రవారం మధ్యాహ్నం 3గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు.
మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన ఓట్లను లెక్కిస్తారని తెలిపారు. అయితే, పురానాపూల్లో శుక్రవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రీ పోలింగ్ ఉన్నందున.. అది ముగిసిన తర్వాతే మొదటి ఫలితాన్ని వెల్లడిస్తారని చెప్పారు.
Cartoon: Poll violence in GHMC
తొలుత 26 వార్డులకు సంబంధించిన ఫలితం వెలువడే అవకాశం ఉందన్నారు. 6గంటలకల్లా మరో 26 వార్డుల ఫలితం వస్తుందని, రాత్రి 8గంటలకు దాదాపు అన్ని వార్డుల ఫలితాలు వెల్లడిస్తామన్నారు. మొత్తం 24 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశామని, లెక్కింపు కేంద్రాల్లోకి కేవలం ప్రింట్ మీడియాకు మాత్రమే అనుమతి ఉన్నట్లు తెలిపారు.
సాయంత్రం 5గంటలకన్నా ముందే ఎవరైనా ఫలితాలు వెల్లడిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పార్టీల నాయకులు ఎవరూ అక్కడకు రావద్దని సూచించారు. కేవలం పాస్లు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
శుక్రవారం పురానాపూల్ డివిజన్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రీపోలింగ్ జరుగుతుందన్నారు. ఓటర్లను స్లిప్లు అడగవద్దని, ఈసారి మధ్య వేలుకు సిరా గుర్తు వేయాల్సిందిగా సిబ్బందికి సూచించినట్లు పేర్కొన్నారు. డివిజన్లో మొత్తం 34,400 ఓటర్లు ఉండగా, 200మంది ఎన్నికల సిబ్బందిని నియమించినట్లు కమిషనర్ వెల్లడించారు.
పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్సులు వచ్చిన రెండు గంటల్లో ఫలితం వెలువడుతుందని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని రికార్డు చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు.
ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే పురానాపూల్ ఈవీఎంలు కూడా కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంటాయని, అవి అందగానే రెండు మూడు గంటల్లో పురానాపూల్ డివిజన్ ఫలితం కూడా వెలువడుతుందని వెల్లడించారు.