ఇక హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ కార్లు: ప్రారంభించిన కేటీఆర్, ఇవీ స్పెషాలిటీస్!
హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా తెలంగాణ సర్కార్ మరో మంచి నిర్ణయం తీసుకుంది. నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న వాహన కాలుష్యాన్ని కొంతైనా నియంత్రించేందుకు చర్యలు మొదలుపెట్టింది. జీహెచ్ఎంసీ అధికారులు వినియోగించే అద్దె వాహనాల కోసం ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తెచ్చింది.
Recommended Video
తొలిదశలో20మంది అధికారులకు వీటిని అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆరేళ్ల పాటు ఈ ఒప్పందం కొనసాగనుంది. పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా మున్సిపల్ మంత్రి కేటీఆర్, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్ఈపీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్హీమ్ ఎలక్ట్రిక్ కార్లను ప్రారంభించారు.
అందుబాటు ధరలోనే
జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 349 అద్దె కార్లు వినియోగిస్తున్నారు. ఒక్కో కారుకు నెలకు రూ.34వేల అద్దెను ప్రభుత్వం చెల్లిస్తోంది. వీటి స్థానంలో పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టేందుకు ఇప్పుడు అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న అద్దె రేటుకే ఎలక్ట్రిక్ కార్లు కూడా అందుబాటులోకి వస్తుండటంతో వాటివైపే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.
నెలకు ఎంత అద్దె:
ఎలక్ట్రిక్ కార్లను అద్దెకిచ్చే ఈఈఎస్ఎల్ డ్రైవర్తో పాటు నెలకు రూ.40 వేలు అద్దె తీసుకుంటుండగా.. జీహెచ్ఎంసీలో పలు వాహనాలు కండెమ్ కావడంతో ఖాళీగా ఉన్న డ్రైవర్లను వీటికి ఉపయోగించుకోనున్నారు. దీంతో డ్రైవర్ వేతనాన్ని మినహాయించి నెలకు రూ.22500 అద్దెపై వీటిని ఇచ్చేందుకు ఈఈఎస్ఎల్ అంగీకరించింది. డ్రైవర్ వేతనాన్ని కలుపుకుంటే నెలకు రూ.34500 అవుతుంది. అద్దెను ఏటా 10శాతం పెంచనున్నారు.
షోరూమ్ ధర రూ.12లక్షల పైమాటే..:
జీహెచ్ఎంసీ అద్దెకు తీసుకున్న ఈ ఎలక్ట్రిక్ కార్ల షోరూమ్ ధర రూ.12లక్షల వరకు ఉంది. టాటా, మహీంద్ర కంపెనీలకు చెందిన ఈ కార్ల సగటు వేగం గంటకు 80కి.మీ. మొదటి దశలో కార్యాలయ విధులు నిర్వహించే అధికారులకే కార్లను కేటాయించాలని నిర్ణయించినా.. ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో అధికారులు వీటిని వినియోగించుకోవడానికి అనుమతినిచ్చారు.
ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొచ్చిన 20కార్లను అడిషనల్ కమిషనర్(ఐటీ) ముషార్రఫ్ ఫారూఖి, ఈ కార్ల ప్రతిపాదనలు సిద్ధం చేసిన విద్యుత్ విభాగం ఈఈ శ్రీనివాసాచారితోపాటు కార్యాలయ విధులు మాత్రమే నిర్వహించే ఫైనాన్షియల్ అడ్వైజర్లు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ తదితరులకు కేటాయింనున్నారు.
గ్రీన్ నంబర్ ప్లేట్:
తాజాగా అందుబాటులోకి తెచ్చిన ఎలక్ట్రిక్ కార్లకు గ్రీన్ నంబర్ ప్లేట్ అయితే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తగిన విధానం తేవాల్సి ఉంటుంది. కాగా, భవిష్యత్తులో చెత్త సేకరణకు కూడా ఎలక్ట్రిక్ ఆటోలను వినియోగించాలని తెంగాణ సర్కార్ భావిస్తోంది. తెలంగాణ కంటే ముందు గుజరాత్ ప్రభుత్వం ఎనిమిది వేల కార్లకు, ఈఈఎస్ఎల్తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఎలక్ట్రిక్ కారు స్పెషాలిటీస్:
ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ పూర్తిగా చార్జింగ్ కావాలంటే 6-8గం. సమయం తీసుకుంటుంది. ఒకసారి బ్యాటరీ ఫుల్ అయితే 100-130కి.మీ వరకు ప్రయాణించవచ్చు. అత్యవసరంగా చార్జింగ్ కావాలనుకుంటే డీసీ చార్జర్ వినియోగించవచ్చునని, తద్వారా గంటలో పూర్తి చార్జింగ్ అవుతుందని చెబుతున్నారు. బ్యాటరీ జీవిత కాలం లక్ష కి.మీ ప్రయాణం కాగా.. చార్జింగ్ తో ప్రయాణం వల్ల కి.మీ దూరానికి రూ.0.89పైసలు విద్యుత్ బిల్లు ఖర్చవుతుంది.