జీహెచ్ఎంసీ షాక్: ఐటీ కంపెనీలకు ఇంటర్నెట్ కట్?..
హైదరాబాద్: జీహెచ్ఎంసీ అధికారులు ఇంటర్నెట్ కేబుల్స్ తొలగించడంతో నగరంలోని పలు ఐటీ కంపెనీల్లో మంగళవారం ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. గచ్చిబౌలి డీఎల్ఎఫ్ ఐటీ కారిడార్ ని ఆనుకుని ఉన్న జయభేరీ ఎన్క్లేవ్లోని ఖాళీ స్థలంలో విద్యుత్ స్తంభాలను అధికారులు తొలగించారు. దీంతో విద్యుత్ స్తంభంపై ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ ను కూడా తొలగించాల్సి ఉంది.
ఆ ఖాళీ స్థలంలో పెట్ పార్కును నిర్మిస్తుండటంతో.. విద్యుత్ స్తంభాలను మార్చాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం శేరిలింగంపల్లి వెస్ట్ జోనల్ కమిషనర్ హరిచందన, శేరిలింగంపల్లి సర్కిల్-20 ఉప కమిషనర్ వి.మమత పెట్ పార్కును సందర్శించారు. వారి సూచనలతో వెస్ట్ జోనల్ ఎలక్ట్రికల్ విభాగం సిబ్బంది క్రేన్ల సహాయంతో విద్యుత్ స్తంభాలపై ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ తొలగించారు.
ముందస్తు సమాచారం గానీ నోటీస్ గానీ ఇవ్వకుండా కేబుల్స్ తొలగించడంతో ఐటీ కంపెనీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ కి కూడా ఫిర్యాదు చేశాయి. అయితే జోనల్ కమిషనర్ హరిచందన మాట్లాడుతూ.. మరికొద్ది రోజుల్లో అక్కడ పెట్ పార్కు ఏర్పాటు చేయాల్సి ఉండటంతో విద్యుత్ స్తంభాలను తొలగించాల్సి వచ్చిందని తెలిపారు. ఇందులో భాగంగానే స్తంభాలపై ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ కూడా తొలగించాల్సి వచ్చిందన్నారు. అయితే కంపెనీలు అనుమతి తీసుకుంటే మళ్లీ కేబుళ్లను పునరుద్దరించేందుకు అవకాశం ఇస్తామని చెప్పారు.