జాగ్రత్త.. కుళ్లిన మాంసంతో బిర్యానీ!, మల్కాజ్గిరిలో హోటల్ సీజ్
కుళ్లి కంపు కొడుతున్న మాంసంతో చేసిన బిర్యానీని హోటల్లో గుర్తించినట్లు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిసనర్ మోహన్ రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్: పలు హోటల్ యాజమాన్యాల తీరు బిర్యానీ అంటేనే కలవరపెట్టేలా చేస్తోంది. పైగా ఈమధ్య కాలంలో బిర్యానీ హోటల్స్ పై నిత్యం ఏదో ఒక వార్త మీడియాలోకి ఎక్కుతూనే ఉంది. తాజాగా నగరంలోని మల్కాజ్ గిరి పరిధిలో ఉన్న ఓ హోటల్ లో పదిరోజులుగా నిల్వ చేసిన మాంసంతో బిర్యానీ వండినట్టు అధికారులు తేల్చారు.
జీహెచ్ఎంసీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం వెలుగుచూసింది. మీర్జాలగూడలో ఉన్న గ్రీన్ బావర్చీ రెస్టారెంట్ పై గురువారం నాడు మల్కాజిగిరి జీహెచ్ఎంసీ హెల్త్ ఇన్ స్పెక్టర్లు ఆకస్మిక దాడులు నిర్వహించారు. పదిరోజులుగా నిల్వ ఉంచి, కుళ్లి.. కంపు కొడుతున్న మాంసంతో బిర్యానీ తయారుచేసినట్లు అధికారులు నిర్దారించారు.
అపరిశుభ్ర వాతావరణంలో వంటకాలు తయారుచేస్తూ కస్టమర్స్ ను అనారోగ్యం పాలు చేసేలా హోటల్ యాజమాన్యం వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. కుళ్లి కంపు కొడుతున్న మాంసంతో చేసిన బిర్యానీని హోటల్లో గుర్తించినట్లు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిసనర్ మోహన్ రెడ్డి వెల్లడించారు.
గ్రీన్ బావర్చీ రెస్టారెంట్ లో తనిఖీల అనంతరం మల్కాజిగిరిలోని స్వాగత్ గ్రాండ్ హోటల్లో అధికారులు తనిఖీలు చేశారు. హోటల్లో అక్రమంగా నిర్వహిస్తున్న పశువధశాలను అధికారులు సీజ్ చేశారు. బోయగూడ పశువధశాల నుంచి పశుసంవర్ధక శాఖ అధికారులు ధ్రువీకరించిన మాంసాన్ని మాత్రమే తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇక అనుమతులు లేకుండా నడుపుతున్న ఒక మటన్ షాపును సైతం అధికారులు సీజ్ చేశారు. అక్రమంగా మాంసాన్ని తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లుగా అధికారులు నిర్దారించారు. నిబంధనలకు విరుద్దంగా మటన్ షాపు నడుపుతుండటంతో జీహెచ్ఎంసీ యాక్టు 1955 ప్రకారం సెక్షన్ 548, 596ల ప్రకారం మటన్ షాపు యజమాని ఘనీపై కేసు పెట్టారు.
తనిఖీల అనంతరం అధికారులు మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ధ్రువీకరించిన పశువధ శాలల్లోనే మాంసం విక్రయించాలని వినియోగదారులకు సూచించారు. పలు హోటల్స్ కుళ్లిపోయిన మాంసంతో బిర్యానీ వండుతున్నందునా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.