నో టీఆర్ఎస్.. నో ఎల్ఆర్ఎస్!: హైదరాబాద్ మేయర్ పీఠంపై బీజేపీ గురి, జనసేనతో పొత్తు!
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని, మేయర్ పీఠం కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సర్కారు, సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ సర్కారు ఐదున్నరేళ్ల పనితీరుపై ప్రజలు తీర్పు ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు.
Recommended Video
టీఆర్ఎస్ సర్కారు నగరానికి ఏం చేసింది..
గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అనేక హామీలు ఇచ్చి విస్మరించిందని కిషన్ రెడ్డి విమర్శించారు. సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నానని ప్రకటించిన కేసీఆర్.. దానిపై ఎప్పుడైనా సమీక్షించారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ను విశ్వ నగరం చేస్తామంటూ ప్రకటించిన టీఆర్ఎస్ సర్కారు.. నగరానికి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
తండ్రీకొడుకులకు ఆర్భాటాలు ఎక్కువ.. అభివృద్ధి తక్కువ
ఇప్పటి వరకు పాతబస్తీకి మెట్రో రైలు వెళ్లకుండా చేసిన పాపం టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలదేనని అన్నారు. తండ్రీకొడుకుల పాలనలో నగరంలో అభివృద్ధి తక్కువ.. ఆర్భాటం ఎక్కువ అన్నట్లుందన్నారు. వరద సాయాన్ని టీఆర్ఎస్ నేతలు గద్దల్లా తన్నుకుపోయారని కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ ప్రజలు చైతన్యవంతులేనని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ దుబ్బాక తరహా ఫలితాలు పునరావృతం చేస్తారన్నారు.
మేయర్ పీఠమే లక్ష్యంగా.. జనసేనతో బీజేపీ పొత్తు..?
రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఎన్నికలు నిర్వహించాలన్నారు. మేయర్ పీఠం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ బరిలో దిగుతోందని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ నాయకులకు మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు. దుబ్బాక నుంచే టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని.. గ్రేటర్ ఫలితాల్లో కల్వకుంట్ల పాలనకు స్వస్తి పలకాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేసే విషయంపై ఆలోచిస్తామన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో కిషన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే మంచి ఫలితాలే సాధించే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
నో టీఆర్ఎస్.. నో ఎల్ఆర్ఎస్..
మరోవైపు బండి సంజయ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ మేయర్ పీఠం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ఫలితమే జీహెచ్ఎంసీలోనూ పునరావృతం అవుతుందని అన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమితో సర్కారు పన్నులు తగ్గించిందని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిపోతే ఎల్ఆర్ఎస్ కూడా ఉండదని వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నో టీఆర్ఎస్.. నో ఎల్ఆర్ఎస్ అనే నినాదంతో ముందుకు సాగుతామని బండి సంజయ్ అన్నారు. ఎల్ఆర్ఎస్ అనేది పేద ప్రజలపై సర్కారు మోపుతున్న కొత్త భారమేనని అన్నారు. కాగా, బీజేపీ తన తొలి అభ్యర్థుల జాబితాను బుధవారం ప్రకటించనుంది. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ నేతలు కసరత్తులు మొదలుపెట్టారు. ఇప్పటికే కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజా సింగ్ సహా కీలక నేతలంతా గ్రేటర్ మేయర్ పీఠం సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. దుబ్బాక జోరును ఇక్కడ కూడా కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నారు.