ఎన్నిక ప్రశాంతం, పాతబస్తీ గొడవ బయటే: కమిషనర్, ఎగ్జిట్ పోల్.. టిఆర్ఎస్కు 80 సీట్లు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ రెండు మూడు చోట్ల చెదురుమదురు ఘటనల మినహా ప్రశాంతంగా కొనసాగిందని, పాతబస్తీలో జరిగిన దాడుల ఘటన పోలింగ్ కేంద్రం బయట జరిగిందని జిహెచ్ఎంసి కమిషనర్ జనార్ధన్ రెడ్డి మంగళవారం తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయమై ఆయన విలేకరులతో మాట్లాడారు. సాయంత్రం అయిదు గంటల వరకు గ్రేటర్ ఎన్నికల్లో 45 శాతం పోలింగ్ జరిగిందన్నారు. మరికొన్ని గంటల్లో పూర్తిస్థాయి పోలింగ్ శాతం పైన స్పష్టత వస్తుందని చెప్పారు.
జిహెచ్ఎంసి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. హింసాత్మక ఘటనలు, రిగ్గింగ్ జరగలేదన్నారు. ఇప్పుడు జరిగిన ఘటనలు పోలింగ్ స్టేషన్ల బయట జరిగినవేనని మజ్లిస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ దాడుల ఘటనను ఉద్దేశించి చెప్పారు.
రిటర్నింగ్ అధికారి నివేదిక ప్రకారం రీపోలింగ్ పైన నిర్ణయం ఉంటుందని చెప్పారు. వెబ్ కాస్టింగ్ వల్ల చిన్న సమస్యలను తక్షణమే పరిష్కరించగలిగినట్లు చెప్పారు. పోలింగ్ ప్రారంభమైన తొలి అరగంటలో ఎనిమిది ఈవీఎంలు మొరాయించినట్లు తెలిపారు. రాత్రి తొమ్మిది గంటలకు పూర్తి సమాచారం వస్తుందన్నారు. కాగా గత ఏడాది 42.92 శాతం పోలింగ్ నమోదయింది.
ఎగ్జిట్ పోల్స్...
గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ముగిసిన సందర్భంగా టీవీ 9 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించింది. గెలుపు గుర్రం టీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చెప్పింది. తమ ఛానెల్ జరిపిన సర్వేల్లో టీఆర్ఎస్కు 78-82, టీడీపీ-బీజేపీ కూటమికి 28-33, కాంగ్రెస్కు 8-10, మజ్లిస్కు 35-40, ఇతరులకు 1-3 స్థానాలు వచ్చే అవకాశముందని తెలిపింది.
న్యాయం చేసే వరకు ధర్నా
పాతబస్తీలో టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, రామ్మోహన్ రెడ్డిలపై దాడికి నిరసనగా కాంగ్రెస్ నేతలు ర్యాలీ చేపట్టారు. గాంధీభవన్ నుంచి డీజీపీ కార్యాలయానికి ర్యాలీ తీశారు. మజ్లిస్ నేతలను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. డిజిపి కార్యాలయం ఎదుట బైఠాయించిన నేతలు.. తమకు న్యాయం జరిగే వరకు తగ్గేది లేదన్నారు.