ఇద్దరు డిప్యూటీ మేయర్లు! సెటిలర్లపై కెసిఆర్ ప్లాన్: గ్రేటర్లో టిఆర్ఎస్కూ డిపాజిట్ షాక్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయనం అనంతరం అధికార టిఆర్ఎస్ పార్టీలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవిల పైన జోరుగా చర్చ సాగుతోంది. మేయర్ పదవి రేసులో బొంతు రామ్మోహన్, కెకె కూతురు విజయలక్ష్మిలు రేసులో ఉన్నారు. మరికొందరు కూడా రేసులో ఉన్నారు.
మరోవైపు, డిప్యూటీ మేయర్ పైన టిఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. డిప్యూటీ మేయర్ పదవులను రెండు ఇవ్వాలని భావిస్తోందని తెలుస్తోంది. ఒకటి సెటిలర్లకు, మరొకటి మైనార్టీలకు ఇవ్వవచ్చునని అంటున్నారు. ఏ పార్టీ సహకారం లేకుండానే టిఆర్ఎస్ మేయర్ పీఠం ఎక్కనుంది.
పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన సెటిలర్లు, ముస్లీం మైనార్టీలకు డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చి వారి భాగస్వామ్యం ఉండేలా చూడాలని టిఆర్ఎస్ భావిస్తోంది. అయితే ఇద్దరు డిప్యూటీ మేయర్లను నియమించాలనుకుంటే ఆర్డినెన్స్ ద్వారా లేదా అసెంబ్లీ ద్వారా చట్ట సవరణ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ప్రస్తుతానికి ఇద్దరు మేయర్ల అంశాన్ని పక్కన పెట్టినా భవిష్యత్తులో ఉండవచ్చునంటున్నారు.
గ్రేటర్లో టీఆర్ఎస్కూ షాక్!
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ 99 డివిజన్లను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ప్రత్యర్థి పార్టీలు ఎక్కువ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయాయి. అదే సమయంలో అధికార టిఆర్ఎస్ కూడా పదిహేను స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. అఖండ విజయం సాధించిన తెరాసకు.. డిపాజిట్ల విషయంలో ఆ స్థానాల్లో షాక్ తగిలింది.
మొత్తం 150 డివిజన్లలో టిఆర్ఎస్ పోటీ చేసింది. అందులో 99 స్థానాల్లో గెలిచింది. పదిహేను స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. ఎంపిక చేసుకున్న డివిజన్లలోనే పోటీ చేసిన మజ్లిస్కూ 10 డివిజన్లలో డిపాజిట్లు దక్కలేదు. కాంగ్రెస్ ఏకంగా 126 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. టీడీపీ 36 స్థానాల్లో డిపాజిట్ గల్లంతయింది.