కుళ్లి కంపుకొడుతున్న చికెన్తో బిర్యానీ: షాక్ తిన్న అధికారులు, 'బావర్చి'పై కేసు
కుళ్లి కంపుకొడుతున్న చికెన్తో బిర్యానీ: షాక్ తిన్న అధికారులు, 'బావర్చి'పై కేసు
హైదరాబాద్: ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు నగరంలోని హోటల్స్పై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఎల్.బి నగర్ లోని ది న్యూ గ్రీన్ బావర్చి హోటల్ ను అధికారులు తనిఖీ చేశారు. కస్టమర్ల ఆరోగ్యాన్ని ఏమాత్రం దృష్టిలో ఉంచుకోకుండా కుళ్లి కంపు కొడుతున్న ఆహార పదార్థాలతో బిర్యానీ వండుతున్నట్లుగా గుర్తించారు.
పాడైపోయిన చికెన్, ఈగలు వాలిన ఆహారపదార్థాలను గుర్తించిన అధికారులు హోటల్ యాజమాన్యాన్ని దీనిపై నిలదీశారు. కస్టమర్ల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా, కనీస నిబంధనలను కూడా పట్టించుకోవడం లేదన్న కారణంగా రూ.10వేల జరిమానా విధించి హోటల్ పై కేసు నమోదు చేశారు.
కాగా, గత కొద్దిరోజులుగా హైదరాబాద్లోని పలు హోటల్స్, రెస్టారెంట్లపై జీహెచ్ఎంసీ ప్రజారోగ్య శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిబంధనలు పాటించని హోటల్స్ పై కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కస్టమర్ల ఆరోగ్యంతో చెలగాటమాడే హోటల్స్ ను ఉపేక్షించబోమని అధికారులు హెచ్చరిస్తున్నారు.