హోటల్ ఫుడ్ అంటేనే బెంబేలెత్తేలా!: వెలుగులోకి నివ్వెరపోయే వాస్తవాలు..
నిజానికి 9నెలల కంటే తక్కువ వయసున్న మేకలు, గొర్రెలు, మూడేళ్లలోపు పశువులు, అలాగే అనారోగ్యంగా ఉన్నవాటిని వధించరాదన్న నిబంధనలున్నాయి.
హైదరాబాద్: హోటల్ ఫుడ్ అంటేనే బెంబేలెత్తిపోయే పరిస్థితి తీసుకొస్తున్నాయి కొన్ని హోటల్ యాజమాన్యాలు. కనీస నిబంధనలను సైతం పాటించకుండా ఇష్టా రీతిన అపరిశుభ్ర వాతావరణంలో వంటలు వండేస్తున్నాయి. తద్వారా హోటల్ కి వెళ్లి భోజనం చేసేవారు అనారోగ్యం పాలవుతున్న పరిస్థితి. ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులను ఈ హోటళ్లు ఎక్కువగా బెంబేలెత్తిస్తున్నాయి.
బిర్యానీ అంటేనే భయపడేలా.. కుళ్లిన మాంసంతో కానిచ్చేస్తున్నారు!..
పశువుల వధ దగ్గరి నుంచి వాటిని వండటం దాకా కనీస శుభ్రతను హోటల్స్ పాటించడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇటీవల జీహెచ్ఎంసీకి దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడటంతో సోమవారం నాడు నగరంలోని పలు హోటల్స్ లో వారు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నివ్వెరపోయే విషయాలు వెలుగుచూశాయి. పేరుకు హైక్లాస్ గా కనిపించే హోటల్స్ కూడా ఈ ప్రమాణాలను విస్మరించడం దిగ్భ్రాంతి కలిగించే అంశం.
జీహెచ్ఎంసీ అధికారుల తనిఖీల్లో.. కొన్ని హోటల్స్ కుళ్లిపోయిన మాంసానికే మసాలా దినుసులు అద్ది బిర్యానీ సహా ఇతరత్రా నాన్ వెజ్ ఐటెమ్స్ వండేస్తున్నట్లు వెల్లడైంది. నాణ్యత ప్రమాణాలను పాటించని హోటల్స్ పై భారీ జరిమానాలు విధించారు. కొన్ని హోటల్స్ ను తాత్కాళికంగా సీజ్ చేశారు.
నిబంధనలను తుంగలో తొక్కి:
నగరంలో ఉన్న వందలాది హోటల్స్ కు నిత్యం కొన్ని టన్నుల మాంసం సరఫరా అవుతుంటుంది. అయితే ఈ మాంసం జీహెచ్ఎంసీ ధ్రువీకరించిన కబేళాలలో కాకుండా ప్రైవేటు వ్యక్తుల కబేళాల నుంచి సరఫరా అవుతుండటం గమనార్హం. ప్రైవేటు కబేళాలల్లో అపరిశుభ్ర వాతావరణంలో పశువధ చేస్తుండటంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. అదీగాక వైద్యాధికారుల సూచనలు కూడా వీరు ఖాతరు చేయట్లేదన్న ఆరోపణలున్నాయి.
ఇవీ నిబంధనలు:
నిజానికి 9నెలల కంటే తక్కువ వయసున్న మేకలు, గొర్రెలు, మూడేళ్లలోపు పశువులు, అలాగే అనారోగ్యంగా ఉన్నవాటిని వధించరాదన్న నిబంధనలున్నాయి. అంతేకాదు జంతువులను వధించిన తర్వాత వాటి రక్తనాళాల్లోని రక్తం ఇంకిపోయిన తర్వాతనే వాటి నుంచి చర్మాన్ని వేరు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రైవేటు కబేళాలల్లో ఈ నిబంధనలను ఎవరు పట్టించుకోవడం లేదు. మాంసంపై వెటర్నరీ వైద్యుడి చేత ధ్రువీకరణ ముద్ర వేయాల్సి ఉండగా.. ఇది ఎక్కడా అమలవుతున్న పరిస్థితి కనిపించడం లేదు.
ఒక్క జియాగూడాలోనే:
నగరానికి సరఫరా అయ్యే మాంసంలో ఒక్క జియాగూడలోని కబేళాలలోనే రోజుకు 70శాతం పశువులను వధిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. జియాగూడ కబేళా 11ఎకరాల్లో విస్తరించి ఉంది. నిజానికి నగరంలో ఉన్న స్లాటర్ హౌజ్ లలో రోజుకు 2వేల మేకలు, గొర్రెల్ని శాస్త్రీయ పద్దతిలో వధించే సామర్థ్యం ఉన్నా కేవలం 50నుంచి 150 పశువుల్ని మాత్రమే ఇక్కడ వధిస్తున్నారు. దీంతో బహిరంగ ప్రాంతాల్లోనే పశువధ యథేచ్చగా జరుగుతోంది.
ఈ హోటళ్లపై జీహెచ్ఎంసీ కొరడా:
సోమవారం నాటి తనిఖీల్లో పలు హోటల్స్ కు జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధించారు. కొన్నింటిని సీజ్ చేశారు. డ్రంక్ యార్డ్ శివాని రెస్టారెంట్ అండ్ బార్(గచ్చిబౌలి), ఓరీస్ (బంజారాహిల్స్), సోహెల్ హోటల్(నల్గొండ క్రాస్ రోడ్స్), ఆస్టోరియా (హోటల్ క్రాస్ రోడ్స్),ప్యారడైజ్ హోటల్(ఐఎస్ సదన్),ఆల్ షబా హోటల్(గచ్చిబౌలి), సాగర్ రెస్టారెంట్(షాపూర్ నగర్), మినర్వా గ్రాండ్(సికింద్రబాద్) హోటల్స్ పై అధికారులు రూ.20వేల జరిమానా విధించారు.