'ఉమ్మడి రాజధాని' చిచ్చు: ఏపీ ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ నోటీసులు?
హైదరాబాద్: ఆస్తి పన్ను చెల్లించాల్సిందిగా కోరుతూ ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసేందుకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) సిద్దమవుతోంది. మరో నాలుగైదు రోజుల్లో ఈ ఆస్తిపన్ను నోటీసులను అందజేయనున్నట్లు సమాచారం.
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ను పదేళ్ల పాటు అటు ఏపీ, ఇటు తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన పలు ప్రభుత్వ కార్యాలయాలు హైదరాబాద్లోని భవనాల్లో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.
దీంతో ఆయా భవనాలు ఈ ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉంటుందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. నోటీసులు ఇచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందనను బట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి 14.5 లక్షల భవనాలున్నాయి.
ఇవిగాక మరో 1109 భవనాలు ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. వీటిలో రెండు ప్రభుత్వాలు తమ తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తుల భవనాలకు విధించిన విధంగానే జీహెచ్ఎంసీ అధికారులు ప్రతియేటా వీటికి పన్ను వసూలు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రతి ఏటా రూ. 40 కోట్లు వరకు ప్రభుత్వం ఇందుకు నిధులు విడుదల చేసేది.
కాగా రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకూ ఆయా భవంతులను కేటాయించారు. దీంతో ఎవరికి కేటాయించిన భవనాలకు ఆయా ప్రభుత్వాలే ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఈ ఆర్ధిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 19 కోట్లు, ఏపీ ప్రభుత్వం రూ. 21 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రూ. 42 కోట్ల మేరకు ఆస్తిపన్ను బకాయి ఉందని, ఈ ఏడాది పన్నుతో కలిపితే మొత్తం రూ. 63 కోట్ల వరకూ చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
ఈ మొత్తాన్ని చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కోరుతూ మరో నాలుగైదు రోజుల్లో నోటీసులు పంపనున్నారు.