ఆసక్తికరంగా గ్రేటర్ ఫలితాలు .. ఉనికి కోసం కాంగ్రెస్ పోరాటం .... అడ్రెస్ లేని టీడీపీ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలలో కమల వికాసం కొనసాగుతోంది. ఈ ఎన్నికల ఫలితాలు టిఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు అన్న భావన వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతున్నట్లుగా తాజా ఎన్నికల ఫలితాల బట్టి తెలుస్తోంది. ఇక ఈ ఎన్నికలలో పోటీ చేసిన టీడీపీ ఖాతా తెరవలేదు . కనీసం ఒక్క చోట కూడా ఆధిక్యం ప్రదర్శించలేదు . గత దుబ్బాక ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికల్లోనూ అదే పంథాను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు, మూడు స్థానాల్లోనే ఆధిక్యతను కనబరుస్తూ ఉండడం ఒక జాతీయ పార్టీకి రావలసిన ఫలితం కాదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Recommended Video
గ్రేటర్ రిజల్ట్స్: జీహెచ్ఎంసీ ఫలితాలపై గ్రేటర్ వరంగల్ వాసుల ఉత్కంఠ..రీజన్ ఇదే
ఎన్నికల ఫలితాలలో ఉనికి కోసం పోరాడుతున్న కాంగ్రెస్
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకూ అధికార పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా ఉన్న రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ నే అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నేతలకు, ఈ ఎన్నికల ఫలితాలు మింగుడు పడడం లేదు. ఊహించని విధంగా బిజెపి దూసుకుపోవడం,టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బిజెపి ఉందన్న భావనకు కారణంగా మారింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ స్థానం, బీజేపీ తర్వాత స్థానానికి పడిపోయింది.
కాంగ్రెస్ పార్టీ పతనానికి నేతల తీరే కారణం
జిహెచ్ఎంసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రచారం చేయకపోవడం, జాతీయ స్థాయి నేతలను కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారానికి రాకపోవడం, ఒకపక్క దుబ్బాక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ నేతల్లో సమన్వయం కొరవడడం, పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీని పతనావస్థకు చేర్చాయి అనడంలో సందేహం లేదు. ఇక ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ, ఆపై జరగనున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లోనూ పునరావృతమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక తాజా ఫలితాలను బట్టి కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతుంది, తెలంగాణ రాష్ట్రంలో పట్టు కోల్పోతుంది అన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అడ్రెస్ లేకుండా పోయిన టీడీపీ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పోటీ చేసిన టిడిపి అడ్రస్ లేకుండా పోయింది. కనీసం ఒక్క స్థానంలో కూడా ఆధిక్యాన్ని కనబరచలేని పరిస్థితికి తెలుగుదేశం పార్టీ చేరుకుంది. ఒకప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ, ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో అడ్రస్ లేకుండా పోవడం పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. కనీసం ఒక్క స్థానంలో కూడా టిడిపి ఆధిక్యాన్ని ప్రదర్శించ లేకపోవడం, తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మనుగడ కోల్పోయింది అని చెప్పడానికి ఒక ఉదాహరణ.
టీడీపీ ఓట్లు చీల్చే అవకాశం .. ఏ పార్టీకి లాభిస్తుందో ?
టీడీపీ అధినేత చంద్రబాబు, గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ శ్రేణులు బరిలోకి దించినప్పటికీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించలేదు. తెలుగుదేశం పార్టీ నుండి చెప్పుకోదగిన స్థాయి ఉన్న నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న లేదు. కేవలం పోటీ చేయడానికి మాత్రమే పరిమితమైన టీడీపీ గ్రేటర్లో ఓటుబ్యాంకు చీల్చే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఏ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంక్ ను టిడిపి చీలుస్తుంది అనేది ఎన్నికల ఫలితాల తరువాత తేలే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కనీసం ఒక్క స్థానంలో కూడా ఆదిక్యం ప్రదర్శించకుండా, ఒక స్థానంలో కూడా ఖాతా తెరవకుండా టిడిపి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మరోసారి అడ్రస్ లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రంలో టిడిపికి స్థానం లేదు అన్నది తాజా ఫలితాలను బట్టి అర్థమవుతుంది.