Covid-19:హైదరాబాదులో 12 కంటెయిన్మెంట్ క్లస్టర్లు ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ
హైదరాబాదు: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 నుంచి ఆయా ప్రభుత్వాలు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా చాలావరకు దేశాలు సంపూర్ణ లాక్డౌన్ విధించగా భారత్లో కూడా ఇదే అమలవుతోంది. ఇక భారత్లో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని లాక్డౌన్ పొడిగింపుపు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక కేంద్రం లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ తెలంగాణలో మాత్రం కొనసాగిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాదులో కరోనావైరస్ నియంత్రణ కోసం 12 కంటెయిన్మెంట్ క్లస్టర్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది.
12 కంటెయిన్మెంట్ క్లస్టర్లు ఏర్పాటు
హైదరాబాదులో ఇప్పటి వరకు 89 పాజిటివ్ కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ క్రమంలోనే హైదరాబాదు మహానగరంలో అధిక జాగ్రత్తలు తీసుకునేలా ప్రభుత్వం అడుగులు ముందుకువేస్తోంది. ఈ క్రమంలోనే 12 కంటెయిన్మెంట్ క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ చెప్పారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ అధికారులు మరియు సిబ్బంది పోలీస్, రెవిన్యూ, ఆరోగ్యశాఖలతో కలిసి సమన్వయంతో పనిచేస్తున్నారని కమిషనర్ లోకేష్ చెప్పారు. 89 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో 12 కంటెయిన్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు లోకేష్ చెప్పారు. ఇదే విషయాన్ని తెలుపుతూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేయడం జరిగింది.
తరుచూ పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు..
ఇక ఈ 12 కంటెయిన్మెంట్ క్లస్టర్లలో మరింత ఎక్కువ దృష్టి సారించామని చెప్పిన కమిషనర్ లోకేష్... ఇక్కడ క్రిమిసంహారక మందును తరచూ కొట్టడంతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అంతేకాదు ప్రతి ఇంటికి జీహెచ్ఎంసీ సిబ్బందితో పాటు ఆరోగ్యశాఖ సిబ్బంది వెళ్లి ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా అని పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇక క్లస్టర్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ప్రజల కదలికలను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని చెప్పారు. బారికేడ్లు ఏర్పాటు చేయడం, బందోబస్తు అన్నీ కొనసాగుతాయని చెప్పారు. ఈ క్లస్టర్లలో 593 మంది ఢిల్లీలో తబ్లీగీ జమాతే కార్యక్రమంలో పాల్గొన్నారని వారిలో 63 మందికి పాజిటివ్గా తేలిందని లోకేష్ చెప్పారు.
మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తాం
ఇక ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా 330 మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇక పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యంను దృష్టిలో ఉంచుకుని వారికి మాస్కులు ఇతరత్రా వస్తువులు అందజేయడం జరిగిందని చెప్పారు. బట్టతో కూడిన 6వేల మాస్కులను కుట్టిస్తున్నట్లు ఆయన చెప్పారు. వీటిని స్వయం సహాయక బృందాల్లోని మహిళలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 30వేల మాస్కులు తయారయ్యాయని మరో 4 రోజుల్లో మిగతావి కూడా వస్తాయని వెల్లడించారు.ఇక పై మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తామని లోకేష్ చెప్పారు. లాక్డౌన్ సందర్భంగా సిబ్బంది సౌకర్యార్థం 34 బస్సులను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ చెప్పారు. ఇక 4500-4800 మెట్రిక్ టన్నుల చెత్తను తీసేసి డంప్యార్డులకు తరలిస్తూ నగరంలో శుభ్రతను మెయిన్టెయిన్ చేస్తున్నట్లు కమిషనర్ లోకేష్ చెప్పారు.