ఏపీ డీజీపీ కి షాక్ ఇచ్చిన జీహెచ్ఎంసీ ... ఆయన అక్రమ నిర్మాణం కూల్చివేత
ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ కు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ షాక్ ఇచ్చింది. ఆయన ఇంట్లోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ కూల్చివేసింది. జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లోని 149 ప్లాటు నంబర్లో డీజీపీ ఇంటి చుట్టూ ఉన్న హౌసింగ్సొసైటీకి చెందిన ఖాళీ స్థలాన్ని ఆక్రమించి నిర్మించారని ప్రహరీ గోడను జీహెచ్ఎంసీ అధికారులు మంగళవారం కూల్చివేశారు.
హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై ఇటీవల తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత పది రోజులుగా పలు అక్రమ నిర్మాణాలను బల్దియా అధికారులు కూల్చివేస్తున్నారు . అందులో భాగంగా ఏపీ డీజీపీ ఇంటి ఆక్రమణలను సైతం తొలగించారు.
ప్రశాసన్ నగర్ లోని 149 ఫ్లాట్ నెంబర్ లో ఏపీ డీజీపీ ఠాగూర్ జీ+1కు అనుమతి తీసుకుని మూడు అంతస్తుల్లో ఇంటిని నిర్మించారు. అనంతరం అదనపు అంతస్తులను క్రమబద్ధీకరించుకున్న ఆయన దక్షిణ, తూర్పు భాగాల్లోని సెట్బ్యాక్ స్థలంలో మెట్ల నిర్మాణం చేపట్టారు. వీటివల్ల పక్కనే ఉన్న జీహెచ్ఎంసీ పార్కులో కొంత స్థలం ఆక్రమణకు గురైనట్లు అధికారులు గర్తించారు. ఈ విషయమై 2017 జూన్ 4న జీహెచ్ఎంసీకి ప్రశాసన్నగర్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఫిర్యాదు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసింది. గతంలో జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేయగా ఏపీ డీజీపీ ఠాగూర్ సిటీ సివిల్ కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఇటీవల కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ను రద్దు చేయడంతో జిహెచ్ఎంసి అధికారులు తుది నోటీసులు సైతం జారీ చేశారు. అందులో భాగంగా పార్క్ లో చేపట్టిన ప్రహరీ కూడా ఇతర నిర్మాణాలను స్వల్పంగా కూల్చేశారు.
తాజాగా ఠాకూర్ పై జీహెచ్ఎంసీ పార్కు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన కోర్టు జీహెచ్ఎంసీ పార్కు స్థలం ఆక్రమణ, అక్రమ నిర్మాణాల కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ను హైకోర్టు మంగళవారం ఆదేశించింది. కాగా కౌంటర్ దాఖలుకు రెండువారాల గడువు ఇవ్వాలని డీజీపీ తరఫు న్యాయవాది కోరగా తిరస్కరించిన ధర్మాసనం.. ఈ నెల 11 నాటికి దాఖలు చెయ్యాలని సూచించింది.