గెట్ ఎ స్మైల్: కోవిడ్ రెస్పాన్స్ అంబులెన్సులు డొనేట్: భార్య, కుమార్తెతో కలిసి జెండా ఊపిన కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కల్లోలాన్ని రేపుతోంది. రోజూ వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనాను కట్టడి చేయడానికి కేసీఆర్ సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేస్తోన్నప్పటికీ.. ఆశించిన ఫలితాలు రావట్లేదు. తెలంగాణలోని ఇతర జిల్లాలతో పోల్చుకుంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉంటోంది. 24 గంటల్లో కొత్తగా తెలంగాణ వ్యాప్తంగా 1811 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ వాటా ఎప్పట్లాగే అధికంగా ఉంది. కొత్తగా 521 కేసులు వెలుగులోకి వచ్చాయి.
అనంతలో వరదలు: వాగులో కొట్టుకుపోయిన కారు: అందులో ఇద్దరు: ఆర్టీసీ బస్సును ఫాలో
ఈ పరిస్థితుల్లో కరోనా పేషెంట్లకు సత్వర వైద్య సహాయాన్ని అందించడానికి తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి, అధికార తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహకక అధ్యక్షుడు కేటీఆర్ ముందుకొచ్చారు. ఆరు కోవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్లను ప్రారంభించారు. కొద్దిసేపటి కిందట హైదరాబాద్లో జెండా ఊపి ఈ ఆరు అంబులెన్స్లను ప్రారంభించారు. గిఫ్ట్ ఎ స్మైల్ క్యాంపెయిన్ కింద కేటీఆర్ వాటిని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులకు అందజేశారు. తన సొంత ఖర్చుతో కేటీఆర్ ఈ ఆరు అంబులెన్స్లను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.
ఈ నెల 24వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ ప్రచార కార్యక్రమాన్ని ప్రకటించారు. స్వచ్ఛందంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఉద్దేశించిన ప్రచార కార్యక్రమం ఇది. దీని కింద కేటీఆర్ తనవంతుగా ఆరు కోవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్ను వైద్య శాఖకు అప్పగించారు. భార్య శైలిమ, కుమార్తె ఆలేఖ్యలతో కలిసి కేటీఆర్ జెండా ఊపి వాటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Recommended Video
కేటీఆర్ను స్ఫూర్తిగా తీసుకుని కొందరు టీఆర్ఎస్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాము కూడా అంబులెన్స్ను కొనుగోలు చేసి వైద్యశాఖకు అప్పగిస్తామని చెబుతున్నారు. త్వరలోనే మొత్తం వంద కోవిడ్ రెస్పాన్స్ అంబులెన్సులను వైద్య శాఖకు విరాళంగా అందజేస్తామని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్ పరీక్షలను ముమ్మరం చేయడానికి వాటిని వినియోగిస్తామని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. కేటీఆర్ను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.