స్కూల్ లిఫ్ట్లో ఇరుక్కొని చిన్నారి మృతి: సునీత మృతి.. చైన్ స్నాచర్ల అరెస్ట్
హైదరాబాద్: దిల్సుఖ్ నగర్లో దారుణం జరిగింది. నాలుగైదేళ్ల చిన్నారి పాఠశాల లిఫ్ట్లో ఇరుక్కొని మృతి చెందింది. ఈ సంఘటన మంగళవారం నాడు ఉదయం చోటు చేసుకుంది. దిల్సుఖ్ నగర్లోని ఓ ప్రయివేటు పాఠశాలలో ఈ ఘటన జరిగింది.
జహానా ఫాతిమా అనే చిన్నారి ఉదయం ఎనిమిది గంటలకు పాఠశాలకు వచ్చింది. పైఅంతస్తులోని తరగతి గదికి వెళ్లేందుకు తోటి విద్యార్థులతో కలసి లిఫ్టు ఎక్కింది. ఆ సమయంలో ఆమె లిఫ్టులో ఇర్కుకొని మృతి చెందింది. ఆమె తల తెగిపోయి ప్రాణాలు విడిచింది.
ఘటనతో అందరూ హతాశులయ్యారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. విగతజీవిగా కనిపించిన తమ కూతురిని చూసి కన్నీరుమున్నీరు అవుతున్నారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ చిన్నారి చనిపోయిందని ఆరోపిస్తున్నారు.
విషయం తెలియడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు జరుపుతున్నట్లు చెప్పారు. కాగా, చిన్నపిల్లలు ఈ లిఫ్ట్ను ఎక్కుతుంటారు. ఇలాంటి లిఫ్టులో ఆ సమయంలో లిఫ్ట్ బాయ్ కూడా లేడని చెబుతున్నారు.
ఇద్దరు స్నాచర్ల అరెస్ట్
ఈస్ట్ జోన్ పోలీసులు మంగళవారం నాడు ఇద్దరు చైన్ స్నాచర్లను అరెస్టు చేశారు. వారు నుంచి 800 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వారిని పాతనేరస్థులుగా గుర్తించారు. గతంలో 25సార్లు దోపిడీకి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు.
గతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సునీత అనే మహిళ మృతికి వీరే కారణమని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం సునీత ద్విచక్ర వాహనం వెనుక కూర్చొని ఉండగా, ఆమె మెడలోని బంగారం లాక్కెళ్లారు. ఈ ఘటనలో కిందపడిన ఆమె, ఆ తర్వాత మృతి చెందారు.