వేకువజామున స్నేహితురాలి ఇంటికెళ్లి ఎంబీయే విద్యార్థి అసభ్య ప్రవర్తన
హైదరాబాద్: తాగిన మైకంలో స్నేహితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఎంబీయే విద్యార్థి కటకటాలపాలయ్యాడు. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన సోమవారం నాడు తెల్లవారుజామున జరిగింది.
రహ్మద్ నగర్లో ఉంటున్న పవన్ ఎంబీయే చదువుతున్నాడు. ఆదివారం అతను రాత్రి స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. మద్యం మత్తులోనే సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు తన స్నేహితురాలి ఇంటి వద్దకు వెళ్లాడు.
అతను తన స్నేహితురాలి ఇంటిలోకి గోడదూకి ప్రవేశించాడు. దీంతో ఆ స్నేహితురాలి అతని పైన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసు స్టేషన్లో చిత్రహింసలు
కరీంనగర్ జిల్లా మహాముత్తారం మండలంలోని యామన్ పల్లి గ్రామానికి చెందిన బిజెపి మండలాధ్యక్షులు సంపత్కు కొమురం భీమ్ విగ్రహం ధ్వంసం ఘటనతో సంబంధం ఉందంటూ అన్యాయంగా పోలీసు స్టేషన్కు తీసుకు వెళ్లి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆదివారం జిల్లా ఎస్పీకి బిజెపి ఫిర్యాదు చేసిందని ఆ పార్టీ నాయకులు చెప్పారు.
లారీ ఢీ, విద్యార్థిని మృతి
సికింద్రాబాద్ రైల్ నిలయం వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పరేడ్ మైదానంకు వెళ్తున్న విద్యార్థిని స్వప్నను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వప్న అక్కడికి అక్కడే మృతి చెందింది. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.
లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో సికింద్రాబాద్ వద్ద భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో రైల్ నిలయం సమీపంలోని ఆర్ఆర్సీ మైదానంలో పరేడ్ రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఆ పరేడ్లో పాల్గొనేందుకు వెళ్తుండగా స్వప్న ప్రమాదంలో మృతి చెందింది.