ప్రియుడి కోసం దొంగగా మారిన యువతి!: ఏం చేసిందంటే..?
ఓ యువతి తన ప్రియుడి కోసం ఏకంగా దొంగగా మారింది.
హైదరాబాద్: ఓ యువతి తన ప్రియుడి కోసం ఏకంగా దొంగగా మారింది. తన ప్రియుడి ఆనందం కోసం దొంగతనాలు చేస్తూ ఆ సొమ్మును అతనికి ఇస్తూ వస్తోంది. అయితే, చివరకు ఆమె.. పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి తెచ్చుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జి సాయి కిరణ్మయి(19) అనే యువతి ఇంజినీరింగ్ చదువుతోంది. మలక్పేటలో ఉండే ఆమె.. యశ్వంత్ నాయుడు అనే యువకుడితో ప్రేమలో పడింది. అతడు జిమ్ ఇన్స్ట్రక్టర్గా పని చేస్తున్నాడు. అయితే, అతనికి డబ్బు అవసరం ఉండటంతో.. సాయి కిరణ్మయి అతనికెలాగైనా సాయం చేయాలని అనుకుంది.
ఈ క్రమంలోనే చెడు మార్గాన్ని ఎంచుకుంది. ఫేస్బుక్ పేజీని క్రియేట్ చేసింది కిర్మణ్మయి. ఆ తర్వాత అనేక మంది మహిళలతో స్నేహం కుదుర్చుకుంది. వారి ఇళ్ళకు వెళ్తూండేది. తన స్నేహితుల కుటుంబాలతో కూడా కలివిడిగా తిరిగేది. వారి ఇళ్ళకు వెళ్లి, కాసేపు ఉండటానికి అవకాశం చిక్కినపుడు బంగారు ఆభరణాలతో పాటు నగదును దొంగిలిస్తూ ఉండేది.
ఇదిలావుండగా, నవంబరు 12న కిరణ్మయి స్నేహితురాలు తన ఇంట్లో 15 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో దర్యాప్తు సందర్భంగా కిరణ్మయిని పోలీసులు అరెస్టు చేశారు.
విచారణలో కిరణ్మయి చెప్పిన విషయాలు పోలీసులకు ఆశ్చర్యానికి గురిచేశాయి. 'నా బాయ్ఫ్రెండ్ యశ్వంత్ జిమ్ ఇన్స్ట్రక్టర్. అతను ప్రస్తుతం డబ్బు కోసం ఇబ్బందులు పడుతున్నాడు. అతనికి సాయం చేసేందుకే ఇలాంటి నేరాలు చేస్తున్నాను' అని పోలీసులకు ఆమె చెప్పింది. దీంతో కిరణ్మయితో యశ్వంత్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఈ నిందితులిద్దర్నీ జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది.