వారం రోజుల్లో అమెరికా వెళ్లాల్సిన అమ్మాయి అర్థాంతరంగా...
హైదరాబాద్: వారంరోజుల్లో అమెరికా వెళ్లాల్సిన యువతి అర్థాంతరంగా బలవన్మరణానికి పాల్పడింది. తనను ప్రేమించిన యువకుడు నమ్మించి మోసం చేశాడని ఆమె మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. దాంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఈ విషాద సంఘటన హైదరాబాదులోని పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై కోటేశ్వరరావు అందుకు సంబంధించిన వివరాలను అందించారు. నిజామాబాద్ నగరానికి చెందిన సత్యనారాయణ, కళావతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురికి ఇప్పటికే వివాహం అయింది.
చిన్న కూతురు భార్గవి(21) ఇటీవలే హైదరాబాదు నగరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసింది. నాలుగేళ్ల క్రితం తండ్రి సత్యనారాయణ అమెరికాలో ఉద్యోగం కోసం వెళ్లగా వారంరోజుల కిందట తల్లి కళావతి సైతం అమెరికా వెళ్లిపోయింది. ఇంట్లో చిన్నాన్న కొడుకు జ్ఞానేశ్వర్తో కలిసి ఉంటున్న భార్గవి కళాశాలలో చదివే సమయంలో రెండేళ్ల నుంచి ఓ యువకుడిని ప్రేమించింది.
అయితే భార్గవి ఇటీవల అమెరికాలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోగా వచ్చింది. మరోవారం రోజుల్లో అమెరికాకు వెళ్లాల్సిన భార్గవి ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకోనని చెప్పాడని మనస్తాపానికి గురైంది. ఈ స్థితిలో శుక్రవారం మధ్యాహ్నం ఫ్యాన్కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
దాన్ని గమనించిన సోదరుడు జ్ఞానేశ్వర్ సమాచారం అందించగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. భార్గవి బావ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.