ముళ్లపొదల్లో ఆడపిల్ల: బాలికపై లైంగిక వేధింపులు, పట్టాలపై శవం
హైదరాబాద్: ఓ కన్నతల్లి తన ఆడశిశువును ముళ్ళపొదల్లో పడేసింది. అక్రమ సంబంధాల వల్ల కలిగిన సంతానమా, లేకుంటే ఆడపిల్ల అని పడేశారో గాని కారణం తెలియదు గానీ మొత్తానికి ఆడశిశువును ముళ్లపొదల్లో పడేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు.
ఈ విషాదకరమైన సంగటన ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో చోటుచేసుకుంది. మెట్పల్లిలోని పెద్దచెరువు దగ్గర గల ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన ఆడశిశువును వదిలి వెళ్లారు. అయితే స్థానికులు గుర్తించి ఆ శిశువును ఆసుపత్రికి తరలించారు.
పట్టాలపై మృతదేహం
ఇదిలావుంటే, వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నందనం గ్రామానికి చెందిన శ్రీను అనే వ్యక్తి మృతదేహాన్ని కాజీపేట రైల్వేస్టేషన్ సమీపంలోగల రైలు పట్టాలపై ఉండడాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. అయితే ఈయన మృతి అనుమానాస్పదంగా ఉంది. మృతుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదవశాత్తూ రైలు ఢీకొందా, లేక ఎవరైనా చంపి రైలు పట్టాలపై పడేశారా అన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మృతదేహం పడి ఉన్న ప్రాంతానికి, శ్రీను స్వగ్రామానికి చాలా దూరం ఉంది. దీంతో ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు విచారణ ప్రారంభించగా త్వరలోనే ఆయన మృతిపై నెలకొన్న మిస్టరీ వీడే అవకాశముంది.
హైకోర్టు భవనంపై నుంచి పడిన వ్యక్తి
హైకోర్టు ఆవరణలో విషాదం చోటు చేసుకుంది. కోర్టు భవనం పైనుంచి ప్రమాదవశాత్తు ఓ కార్మికుడు కింద పడ్డాడు. ఏసీ మరమ్మతు చేస్తూ రెండో అంతస్తు నుంచి కింద పడిపోయాడు. కార్మికుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
మహిళ ఆత్మహత్యాయత్నం
మహబూబ్నగర్ జిల్లా ఇటిక్యాల మండం కోడేరులో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మగ పిల్లలతో సహా తల్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. విషయాన్ని గమనించిన స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
లైంగిక వేధింపులు
హైదరాబాద్లోని మీర్చౌక్ పీఎస్ పరిధిలోని కాలికబర్లో ఆరేళ్ల బాలికను రాము అనే యువకుడు లైంగికంగా వేధించాడు. ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన గంటలోపే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిపై పోస్కో, నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
వీడిన హత్య కేసు మిస్టరీ
రంగారెడ్డి జిల్లాలోని రావులపల్లిలో ఓ హత్య ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. హత్య మిస్టరీని చేధించిన పోలీసులు శవాన్ని వెలికి తీశారు. మూడు నెలల క్రితం చేవెళ్ల మండం రావులపల్లిలో మహేందర్ అనే యువకుడు అదృశ్యమయ్యాడు.
ఈ కేసులో పోలీసులు అనుమానంతో బంధువులు, స్థానికులను విచారించారు. విచారించిన వారిలో కొందరు మహేందర్ను హత్య చేశామని ఒప్పుకున్నారు. రావులపల్లిలోని మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. నేడు పోలీసులు శవాన్ని వెలికి తీస్తున్నారు.
పాము కాటుకు తల్లీకూతుళ్ల మృతి
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం బిజిలీపూర్లో విషాదం చోటు చేసుకుంది. పాము కాటు వేయడంతో తల్లీ,కూతురు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో గ్రామంలో విషాదచాయలు చోటు చేసుకున్నాయి.