మళ్ళీ ఆడపిల్ల పుట్టిందని .. నీటి తొట్టిలో పడేసి ప్రాణం తీసిన కసాయి తండ్రి
రక్తం పంచుకు పుట్టిన శిశువును అతి కిరాతకంగా తండ్రి హతమార్చిన ఘటన కొత్త గూడెం జిల్లా భద్రాద్రిలో చోటు చేసుకుంది. కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి ఆ బిడ్డ పాలిట కాలయముడయ్యాడు . పెంచి పోషించాల్సిన కన్నతండ్రే ఆ పసిపాప పాలిట మృత్యువుగా మారాడు. ఆడబిడ్డగా పుట్టడమే ఆ శిశువు చేసిన నేరం.
మంజూరైన ఋణం ఇవ్వలేదని... బ్యాంకు ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు
పుట్టి నెల రోజులైనా కాకముందే మళ్లీ ఆడపిల్ల పుట్టిందని ఆ శిశువు ఊపిరి తీశాడు తండ్రి. ఏమీ తెలియని ఆ చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తున్నా వదలకుండా నీటి తొట్టిలో ముంచి ప్రాణం తీశాడు. ఆకాశంలో సగం అవనిలో సగం అని ఆడపిల్లల గురించి గొప్పగా చెబుతున్న నేటి సమాజం లోనూ ఆడపిల్లలు అడుగడుగున వివక్షకు గురవుతూనే ఉన్నారు. తల్లిగర్భంలోనో , లేదా భూమి మీద పడిన తర్వాతనో ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు .
చర్ల మండలం రేగుంటలో రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టిందని.. ఆ ఆడశిశువును నీళ్ల తొట్టిలో ముంచి చంపేశాడు ఓ తండ్రి . ఇక వివరాలను చూస్తే సూర్యతేజ అనే వ్యక్తి ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మొదటి సంతానం ఆడపిల్ల పుట్టింది. ఇక రెండోసారి అయినా మగబిడ్డ పుడతాడని అనుకున్నాడు. కాని రెండోసారి కూడా పాపే పుట్టడంతో ఆ బిడ్డను హతమార్చాలని నిర్ణయం తీసుకున్నాడు. భార్యకు తెలియకుండా బిడ్డ ప్రాణం తీశాడు. రాత్రి ఇంటికొచ్చిన అతను శిశువును తీసుకెళ్లి ఇంటిపక్కనే ఉన్న నీటి తొట్టిలో పడేశాడు. దీంతో శిశువు నీటిలో మునిగి చనిపోయింది. తెల్లవారుజామున పాప కనిపించకపోవడంతో సూర్యతేజను భార్య అఖిల నిలదీసింది. బిడ్డ ప్రాణాలు తీసిన ఆ తండ్రి పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో అనుమానం వచ్చి బంధువులను పిలిచింది.
దీంతో అక్కడికి వచ్చిన వారంతా బిడ్డని ఏంచేసావో చెప్పమంటూ దేహశుద్ధి చేశారు. అందరూ కలిసి నాలుగు తగిలించి నిలదీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆడపిల్ల పుట్టిందన్న కోపంతో సూర్యతేజనే పాపను చంపేశాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.అభం శుభం తెలియని చిన్నారి, ఆడపిల్లగా భూమ్మీద పడిన ఖర్మానికి కన్నతండ్రి చేతిలోనే కడ తేరిపోయింది.
ఆడా మగా ఇద్దరూ సమానమే అంటూ ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినా, మగ వారికి ధీటుగా ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్న ఇంకా చాలా మారుమూల గ్రామాలలో, తెలంగాణ రాష్ట్రంలోని తండాలలో ఆడపిల్లల విక్రయాలు, ఆడపిల్లలను హతమార్చడం వంటి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల వర్ధన్నపేట సమీపంలో ఆడపిల్ల పుట్టిందని తాత వడ్ల గింజ వేసి ప్రాణం తీసిన ఘటన చోటుచేసుకుంది. ఇక అది మరిచిపోకముందే సూర్య తేజ అనే కసాయి తండ్రి మరో పసిపాప ఉసురు తీశాడు.